గౌరీ లంకేశ్ను నేనే చంపేశా, కించపర్చారు: కీలక నిందితుడు వాఘ్మేర్
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ను తానే చంపానని కీలక నిందితుడు పరశురామ్ వాఘ్మేర్ చెప్పాడు. హిందువులు, హిందూ సంస్థలను కించపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నందునే గౌరీ లంకేశ్ను తుపాకీతో కాల్చి హత్య చేశానని పరశురామ్ వాఘ్మేర్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులవద్ద తన నేరాన్ని అంగీకరించాడు.
మూడు బుల్లెట్లను ఆమె శరీరంలోకి దించినట్లు వెల్లడించాడు. హత్య తరువాత తుపాకీని తన సహచరుల్లో ఒకరికి ఇచ్చేశానని బుధవారం విచారణ సందర్భంగా చెప్పాడని అధికారులు వెల్లడించారు. హత్య చేశాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో నిందితుడు తలదాచుకున్నాడని తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే సిట్ అదుపులో ఉన్న నవీన్ కుమార్ అలియాస్ హొట్టె నవీన్ పాత్రనూ కీలకంగా భావిస్తున్నారు. హత్య తరువాత పరశురామ్ వాఘ్మేర్, ఇతర నిందితులకు నవీన్ ఆశ్రయం ఇచ్చాడని గుర్తించారు.
శుక్ర, శనివారాల్లో దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి అనుచేత్ మీడియాకు తెలిపారు. పరశురామ్ వాఘ్మేర్ను సిట్ అధికారులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. బుధవారం రాత్రంతా అతడ్ని విచారించారు.