రైల్వే ప్రైవేటీకరణ.. అబ్బే అదేం లేదే, పార్లమెంట్లో మంత్రి పీయూష్ గోయల్
కీలక రంగాలను ప్రైవేటీకరిస్తుపోతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అనడంతో అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ సెక్టార్లో కీలకం ఎయిర్ ఫోర్స్, రైల్వే.. రైల్వేలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల రైల్వే ప్రైవేటీకరణ అంశం గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది. తాజాగా ఇవాళ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణ తప్పదు, లేదంటే మూత: కేంద్రమంత్రి ఠాకూర్
రైల్వేను ప్రైవేటీకరించబోమని గోయల్ తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ అనే మాటకు తావులేదని చెప్పారు. అయితే ప్రైవేట్ సంస్థలను మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పారు. ఇదీ రైల్వే పనితీరు కోసమేనని చెప్పారు. రైల్వే గ్రాంట్లుల గురించి సభ్యులు పట్టుబట్టగా పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో ఒక్క ప్రయాణికుడు కూడా రైలు ప్రమాదంతో చనిపోలేదని సభకు వివరించారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యం అని పీయూష్ గోయల్ తెలిపారు.
దేశం వృద్ది సాధించే క్రమంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రెండింటిలో ఉపాధి అవకాశాలు ముఖ్యమని చెప్పారు. భారతీయ రైల్వే ప్రతీ ఒక్క భారతీయుడి ఆస్తి అని.. దాని ప్రైవేటీకరణ అనే మాటకు తావులేదని చెప్పారు. ప్రభుత్వంలో రైల్వే ఎప్పుడూ అంతర్భాగమేనని చెప్పారు. రైల్వే కేటాయింపులను మోడీ ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. 2019-20లో అదీ 1.5 లక్షల కోట్లు ఉంటే.. 2021-22లో అదీ 2.15 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు.