'నమో' అంటే నో యాక్షన్, ఓన్లీ మెసేజ్: మోడీపై జైరామ్ సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 'నమో' అంటే.. మాటలు మాత్రమే.. చేతలు లేవు (NAMO- No Action Message Only) అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ భాష్యం చెప్పారు.
భూసేకరణ చట్టంలోని సవరణలకు ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవడంపై స్పందిస్తూ ప్రజాస్వామ్య భారత్ను మోడీ హత్య చేస్తున్నాడని (MODI.. Murder Of Democratic India) జైరాం వ్యాఖ్యానించారు.
సోమవారం ప్రధాని ఏబీసీడీతో మార్గంలోకి రావాలని అధికారులకు పిలుపునివ్వగాజైరాం ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా వర్క్ షాప్లో భాగంగా మోడీ ఏబీసీడీ, రోడ్ అనే పదాలు ఉపయోగించారు. వాటిని వివరిస్తూ తమ పాలన తీరును ప్రకటించారు. దానిపై జైరామ్ సెటైర్లు వేశారు.
జనవరికల్లా ఏర్పాట్లు పూర్తి చేయండి: ప్రధాని ఆదేశం
ప్రభుత్వ ఉన్నతాధికారులంతా తమ ఆస్తుల వివరాలను ఏప్రిల్ చివరి గడువులోగా దాఖలు చేయడానికి వీలుగా అందుకు సంబంధించిన అన్ని చర్యలను జనవరి చివరినాటికల్లా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రధాని ఆదేశాలను తెలియజేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల సెక్రటరీలకు లేఖలు కూడా రాసింది. సవరించిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులందరూ తమతో పాటుగా భాగస్వామి, తమపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏడాది దాఖలు చేయాల్సి ఉంటుంది.
ప్రతి ఏటా ఆ వివరాలను అధికారులు అదే ఏడాది జూలై 31లోగా దాఖలు చేయాలి. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఈ వివరాలు దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 కాగా, ఆ గడువును తర్వాత డిసెంబర్ చివరినాటికి, ఇప్పుడు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించారు.
దీనికి సంబంధించి అన్ని చర్యలు 2015 జనవరి 31 నాటికి తీసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల డిపార్ట్మెంట్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన లేఖలో పేర్కొంది. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని అధికారులు, సిబ్బంది ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని అన్ని మంత్రిత్వ శాఖలకు పంపిన ఉత్తర్వులో కోరింది.