ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, జయ మేనకోడలు దీపాకు షాక్, నామినేషన్ తిరస్కరణ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు భారత ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అమ్మ వారసురాలు నేను అని నిరూపించుకోవాలని ప్రయత్నించిన దీపా జయకుమార్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీపా జయకుమార్ నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.

అమ్మ వారసులు
జయలలిత ప్రాతినథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు డిసెంబర్ 21వ తేదీన జరగనున్నాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సోమవారం నామినేషన్లు వెయ్యడానికి చివరికి రోజు.

దీపా జయకుమార్ నామినేషన్
సోమవారం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వతంత్ర పార్టీ (ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై) అభ్యర్థిగా నామినేషన్ చేశారు. మంగళవారం నామినేషన్ పత్రాలు పరిశీలించిన ఎన్నికల కమిషన్ అధికారులు దీపా జయకుమార్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

బ్యాంకుకు సంబంధించి !
దీపా జయకుమార్ నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ లో బ్యాంకు ఫాం 26 I సమర్పించలేదని, అందుకోసం నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నామని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న దీపా ఓ తమిళ టీవీ చానల్ తో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.

పోటీ వద్దని బెదిరించారు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని తమిళనాడు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తనకు ఫోన్లు చేసి మరీ బెదిరించారని దీపా జయకుమార్ ఆరోపించారు. గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తనను బెదరించారని దీపా ఆరోపించారు.

కావాలనే తిరస్కరించారు
గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నామినేషన్లు ఎలా వేశానో ఇప్పుడు అలాగే వేశానని, అప్పుడు నామినేషన్ పత్రాలు తిరస్కరించని అధికారులు ఎప్పుడు ఎందుకు తిరస్కరించారు అని దీపా ప్రశ్నించారు. తనను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్న వారికి ఆ దేవుడే తగిన బద్ది చెబుతారని జయలలిత మేనకోడలు దీపా అన్నారు.












Click it and Unblock the Notifications