జయకు సెంటిమెంట్ కలిసొచ్చింది!, దటీజ్ మమతా బెనర్జీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సెంటిమెంట్ కలసి వచ్చింది. జయలలితకు సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆమెకు 6 సంఖ్య పైన సెంటిమెంట్ అంటుంటారు. ఆమె మేనిఫెస్టో ప్రకటించిన తారీఖు 6వ తేదీ. వారంలో ఆరో రోజు అయిన శుక్రవారం నాడే దానిని ప్రకటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆరు. ఉచిత మొబైల్స్, స్కూటర్లు, 50 శాతం డిస్కౌంట్, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సెట్ టాప్ బాక్సులు, 100 యూనిట్ల లోపు విద్యుత్కు బిల్లు లేకపోవడం.. వంటి హామీలతో ప్రచారం ప్రారంభించారు.
అదే విధంగా.. జయలలిత అదృష్ట సంఖ్య ప్రకారం విజయం తథ్యమని మొదటి నుంచి అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. జయలలిత ఓటు వేయడానికి బయలుదేరిన సమయం నుంచి ఓటు వేయడం, ఓటరు సంఖ్యతో సహా అన్నీ లెక్కగట్టి.. సంఖ్యాశాస్త్రం ప్రకారం విజయం తప్పకుండా వరిస్తుందని ఆమె అనుయాయులు అనుకుంటున్నారు. ఆమె లక్కీ నెంబర్ 2.
ఓటు వేసిన తర్వాత మరో రెండు రోజుల్లో తెలుస్తుందని మళ్లీ రెండుపైనున్న తన ప్రేమను జయలలిత చాటుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు తమకు కలిసిరావడంతో పాటు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో తమ అధినేత్రి కూర్చుంటారన్న అభిమానుల ఆశలు నెరవేరాయి. కాగా, జయలలిత ఈ నెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.
దీదీ గెలుపు వెనుక..!
మమతా బెనర్జీ పైన నేరుగా పెద్దగా అవినీతి మరకలు లేవు. కేంద్రమంత్రిగా పని చేసినా, ముఖ్యమంత్రిగా పని చేసినా ఎక్కడా లాలూచీ పడలేదంటారు. సమాన్యులకు అన్యాయం జరుగుతుందంటే పోరడడానికి సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం ఉంది.
మమతా బెనర్జీని బెంగాలీలు ముఖ్యమంత్రిగా పొందడం బెంగాలీల అదృష్టమని అంటారు. మచ్చలేని రాజకీయ నేతగా ఉన్నందునే బెంగాల్ పీఠంపై రెండోసారి మమత కూర్చోబోతున్నారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకుంది. కాగా, మమతా బెనర్జీ మే 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మమతా బెనర్జీ కోల్కతాలో 1955 జనవరి 5న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 15వ ఏటనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇస్లామిక్ హిస్టరీలో మాస్టర్ డిగ్రీతో పాటు లా డిగ్రీ, కళింగ ఇన్సిట్యూట్ నుంచి ఆనర్స్ కూడా అందుకున్నారు.
మమతాబెనర్జీ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ సభ్యురాలిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీలో దీదీ పలు పదవులు చేపట్టారు. 1976లో బెంగాల్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యలు చేపట్టారు.
1984లో జాదవ్పూర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1991లో కూడా దక్షిణ కోల్కతా లోకసభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరులు, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా బాధత్యలు స్వీకరించారు.
అయితే క్రీడల అభివృద్ధికి పీవీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఉన్నచోట తాను ఉండలేనంటూ కాంగ్రెస్ నుంచి వైదలగిన దీదీ 1997లో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ)ను ఏర్పాటు చేశారు. 1999లో లోకసభ ఎన్నికల్లో గెలిచిన మమత ఎన్డీయే కూటమిలో చేరారు.
వాజ్పేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు. రైల్వేశాఖకు తొలి మహిళా మంత్రి అయన మమతా బెనర్జీ... పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా 2,000 సవంత్సరంలో మళ్లీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అయితే ఏన్డీయే కూటమి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏడాది తెహల్కా కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఎన్డీయే నుంచి వైదొలిగారు. అయినా మళ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో జతకట్టి రైల్వే మంత్రిగా తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో తన సొంత రాష్ట్రానికే ఎక్కువ ప్రాజెక్టులు కేటాయించి, విమర్శలు ఎదుర్కొన్నారు.
2005లో ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న ముస్లింలను అడ్డుకోవాలంటూ మరో ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంపై పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
సింగూర్లో అప్పటి సీపీఎం ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన టాటా మోటార్స్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించి రైతులకు అండగా మమత నిలిచారు. 2009 లోకసభ ఎన్నికల్లో యూపీఏతో పొత్తుపెట్టుకుని మరోసారి రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే భారత్లోకి ఎఫ్డీఐలను అనుమతిస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ కాంగ్రెస్కు దూరమయ్యారు. బెంగాల్ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన నందిగ్రామ్ ఉద్యమానికి నేతృత్వం వహించిన మమతా సీపీఎం ఆగడాలను కట్టించి 2011లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించారు.