'కోడిపుంజు' గుర్తు కోసం దీప ప్రయత్నాలు.. ఒకప్పుడు జయలలిత గుర్తు అదే!
ఒకప్పుడు జయలలితకు కేటాయించిన 'కోడిపుంజు' గుర్తును తమ పార్టీ ఎంజీఆర్ అమ్మ దీప పేరవైకి కేటాయించాలని దీప ఎన్నికల సంఘానికి విన్నవించారు.
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానంలో సత్తా చాటి తామే జయలలితకు అసలైన రాజకీయ వారసులమని చాటుకోవడానికి ఆయా పార్టీలు,వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా శశికళతో పోరులో భంగపడ్డ పన్నీర్ సెల్వం, జయలలిత మేనకోడలు దీప, అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఈ బరిలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇప్పటికైతే ఏ పార్టీ, వర్గం తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. కొత్త పార్టీ పెట్టి ఉత్సాహం మీదున్న జయలలిత మేనకోడలు దీప మాత్రం స్వయంగా బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ నెల 16నుంచి నామినేషన్లు మొదలవనున్న నేపథ్యంలో.. తమ పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దీప దరఖాస్తు చేసుకున్నారు.
ఒకప్పుడు జయలలితకు కేటాయించిన 'కోడిపుంజు' గుర్తును తమ పార్టీ ఎంజీఆర్ అమ్మ దీప పేరవైకి కేటాయించాలని దీప ఎన్నికల సంఘానికి విన్నవించారు. దీన్నిబట్టి అమ్మ సెంటిమెంటును దీప జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అన్నాడీఎంకె వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మరణానంతరం ఆయన సతీమణి జానకి, జయలలితల మధ్య పార్టీ చీలిపోవడంతో.. జయలలిత వర్గానికి ఎన్నికల కమిషన్ కోడిపుంజు గుర్తును కేటాయించింది. ఒకవేళ కోడిపుంజు గుర్తు కేటాయించడం కుదరని పక్షంలో చేప, త్రాసు లేదా శ్రామికుడి చెయ్యి వంటి గుర్తులను కేటాయించాలని దీప ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదిలా ఉంటే, అటు అన్నాడీఎంకె పార్టీ గుర్తు 'రెండాకుల'పై కూడా వివాదం నడుస్తోంది. ఆ గుర్తు తమకే కేటాయించాలంటూ పన్నీర్ వర్గీయులు ఎన్నికల కమిషన్ ను కోరుతుండటంతో దీనిపై సందిగ్దం నెలకొంది.












Click it and Unblock the Notifications