‘‘నా మనసు పాడుచేశారు.. ప్రజల్లో నా పరువు తీశారు.. రూ.14 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే’’
తన మనసు పాడుచేసి, ప్రజల్లో తన పరువు తీశారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ భారీ పరిహారం డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: తన మనసు పాడుచేసి, ప్రజల్లో తన పరువు తీశారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ భారీ పరిహారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ సహా మరో ఆరుగురు సీనియర్ న్యాయమూర్తులకు లేఖరాశారు.
వీరంతా పరువు నష్టం కింద తనకు రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ''ఫిబ్రవరి 8 మొదలు ఇప్పటివరకు ఈ ఏడుగురు జడ్జిలు నా న్యాయవిధులు, పరిపాలన వ్యవహారాలు చూసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు'' అని జస్టిస్ కర్ణన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు.. వారం రోజుల్లోగా తనకు నష్టపరిహారం చెల్లించకపోతే తాను కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తానంటూ ఆయన బెదిరింపులకు దిగినట్టు ఓ జాతీయ పత్రిక ఉటంకించింది.
''వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే నేను కూడా ఆ న్యాయమూర్తుల కార్యకలాపాలకు అడ్డం తగలాల్సి ఉంటుంది'' అని జస్టిస్ కర్ణన్ తన లేఖలో పేర్కొన్నారు.
కోర్టు ధిక్కారం కేసులో విచారణకు హాజరుకానందుకు సుప్రీం కోర్టు జస్టిస్ సీఎస్ కర్ణన్ కు బెయిలబుల్ వారెంటును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రతిగా ధర్మాసనంలోని మొత్తం ఏడుగురు న్యాయమూర్తులపై విచారణ చేయాల్సిందిగా కర్ణన్ సీబీఐని ఆదేశించారు. అది జరిగిన ఆరు రోజులకు ఆయన ప్రధాన న్యాయమూర్తి సహా ఆరుగురు న్యాయమూర్తులకు లేఖ రాయడం విశేషం.