కర్ణాటక లోకాయుక్త భాస్కర్ రావు రాజీనామా?
బెంగళూరు: తన కుమారుడిపై అవినీతి కేసు నమోదైన నేపథ్యంలో కర్ణాటక లోకాయుక్త జస్టిస్ భాస్కరరావు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఆరోపణలపై బెళగావిలో శాసనసభ, మండలి సమావేశాల్లోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై విపక్షాలు వాకౌట్ చేశాయి.
రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఎం.ఎన్.కృష్ణమూర్తి నుంచి రూ.కోటి లంచం డిమాండ్ చేసిన ఆరోపణపై జస్టిస్ భాస్కరరావు కుమారుడు అశ్వినీ రావు అలియాస్ కృష్ణారావుపై నాటకీయ పరిణామాల మధ్య బుధవారం లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు లోకాయుక్త అంతర్గత విచారణపై అశ్వినీరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక వచ్చేదాకా విచారణ చేపట్టవద్దని లోకాయుక్తను ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. కానీ, ఈ ఉత్తర్వులు వెలువడటానికి ముందే లోకాయుక్త ఎస్పీ సోనియానారంగ్కు ఈఈ కృష్ణమూర్తి ఆధారాలతో లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం-1988తోపాటు ఐపీసీ సెక్షన్లు 384, 419, 420, 120 (బి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
శాసనసభ, మండలిల్లో లోకాయుక్త అవినీతే ప్రధాన చర్చనీయాంశంగా మారింది ఉభయసభలు బుధవారం సాయంత్రం దాకా నిరసనలు, వాగ్వాదాలు, విమర్శలతో అట్టుడికాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాల బీజేపీ నేత జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. జేడీఎస్ పక్ష నేత కుమారస్వామి కూడా ఇదే డిమాండ్ చేయడంతోపాటు ఈ అవినీతితో ఓ మంత్రి కుమారుడికీ ప్రమేయం ఉందని ఆరోపించారు.
ప్రతిపక్షాల డిమాండ్ను స్పీకర్ కాగోడు తిమ్మప్ప సమర్థించడం విశేషంగా చెప్పుకోవాలి. దీనిపై సీఎం సిద్దరామయ్య సుదీర్ఘ వివరణ ఇచ్చారు. లోకాయుక్త కోరిన మేరకే సిట్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని, నివేదిక వచ్చిన తర్వాత చట్ట సవరణ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.