స్టార్ హోటల్ వద్దు: పశువుల పాకలో రాత్రిపూట బీజేపీ ఎమ్మెల్యే, ఎందుకంటే !
కర్ణాటకలోని నంజనగూడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ మైసూరులోని స్టార్ హోటల్ లో తాను బస చెయ్యనని చెప్పి ఓ పల్లెలో పశువుల కోసం నిర్మించిన ఓ షెడ్ లో ఆవుల మధ్య
మైసూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని రాజాజీనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (బీజేపీ) సురేష్ కుమార్ కు చాల ప్రత్యేకత ఉంది. గతంలో యడ్యూరప్ప మంత్రి వర్గంలో ఆయన మంత్రిగా పని చేసే సమయంలో సాదారణ కార్యకర్తలాగే ఉన్నారు.
హంగులు, ఆర్బాటాలకు బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ దూరంగా ఉంటారు. కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్బంగా మాజీ మంత్రి సురేష్ కుమార్ మళ్లీ హాట్ టాఫిక్ గా మారిపోయారు. అన్ని సౌకర్యాలు ఉన్న స్టార్ హోటల్ లో ఆయనకు బస ఏర్పాటు చేసినా సున్నితంగా తిరస్కరించి పల్లెటూరిలోని పశువుల పాకకు మకాం మార్చారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త
సురేష్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రాజాజీనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే అయిన తరువాత కూడా ఆయన టీవీఎస్ స్కూటర్ మీద తన నియోజక వర్గంలో సంచరించి ప్రజల కష్టాలు తెలుసుకునే వారు. అంత సర్వసాధారణంగా బీజేపీ కార్యకర్తగా ఉండాలంటే తనకు ఇష్టం అని ఎన్నోసార్లు సురేష్ కుమార్ చెప్పారు.
ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు
నంజనగూడు ఉప ఎన్నికల సందర్బంగా అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వి. శ్రీనివాస్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి కర్ణాటక మాజీ మంత్రి సురేష్ కుమార్ వెళ్లారు. నంజనగూడులో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. ఎండ దెబ్బను సైతం లెక్క చెయ్యకుండా నాయకులు ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
అందరికీ స్టార్ హోటల్ లో
నంజనగూడులో ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు మైసూరులోని ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాట్లు చేశారు. అయితే తాను అక్కడ ఉండలేనని తేల్చి చెప్పిన మాజీ మంత్రి సురేష్ కుమార్ గత నాలుగు రోజుల నుంచి నంజనగూడు సమీపంలోని కపిలేష్ అనే రైతుకు చెందిన తోటలోని పశువుల పాకలో బస చేస్తున్నారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద షెడ్ లో ఒక పరుపు వేసుకుని దినపత్రికలు చదువుతూ, స్థానిక గ్రామస్తులతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కాలం గడిపేస్తున్నారు.
ఇది ప్రచారం కోసం గిమ్మిక్కు కాదు
స్టార్ హోటల్ తనకు అన్ని సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసినా బహిరంగ ప్రదేశాలు, పశువుల పాకలు, తోటలో ఉండే ఆ ఆనందం, సంతోషం వేరని, సర్వసాధారణంగా ఉండటానికి తాను ఎక్కువ ఇష్టపడుతానని సురేష్ కుమార్ అంటున్నారు. అంతే కాని తనకు ప్రచారం కావాలనో, గిమ్మిక్కులు చెయ్యాలనే ఉద్దేశం లేదని సురేష్ కుమార్ కుండలు బద్దలు కొట్టి చెప్పారు.
బెంగళూరు టూ తిరుమల
గతంలో సురేష్ కుమార్ ఇలాగే పశువుల పాకలు, ప్రభుత్వ పాఠశాలల్లో రాత్రి పూట బస చేసిన సందర్బాలు ఉన్నాయి. 2013లో బెంగళూరు నుంచి తిరుమలకు పాద యాత్ర, 2014 లో బెంగళూరు నుంచి ధర్మస్థలం కు పాదయాత్ర, 2015లో బెంగళూరు నుంచి శబరిమలైకు పాద యాత్ర చేసే సమయంలో ఇలాగే పశువుల పాక, ప్రభుత్వ పాఠశాలల్లో బసచేశానని సురేష్ కుమార్ అంటున్నారు. మొత్తం మీద సురేష్ కుమార్ పలువురు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.