మోహన్ లాల్ ప్లాప్ షోకి మమ్ముట్టి మద్దతు... డబ్బుని తీసుకోబోమన్న సీఎం
కొచ్చి: కేరళ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'లాలిసోమ్' బ్యాండ్ కచేరీ ప్రేక్షకులను తీవ్ర నిరాశపరడంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాను తీసుకున్న రూ. 1.6 కోట్లు వెనక్కి ఇచ్చేస్తానని మోహన్ లాల్ ప్రకటించారు.
ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పందిస్తూ ఆ డబ్బుని తిరిగి తీసుకోబోమన్నారు. "మోహన్ లాల్ నుంచి డబ్బు స్వీకరించం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. లీగల్ కాంట్రాక్టులో భాగంగా ఆ డబ్బునిచ్చాం" అని చాందీ పేర్కొన్నారు.

మోహన్ లాల్కు మమ్ముట్టి మద్దతు
సూపర్ స్టార్ మోహన్ లాల్కు ప్రముఖ నటుడు మమ్ముట్టి మద్దతు ప్రకటించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 'ఒక కార్యక్రమం నిర్వహించడానికి కళాకారులు ఎంతో కష్టపడతారు. మోహన్ లాల్ మనకు గర్వకారణం. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఆయన స్ఫూర్తిని అందరూ అభినందించాలి' అని అన్నారు.
దీంతో పాటు మోహన్ లాల్కు అండగా నిలబడాలని మిగిలిన నటులకు కూడా పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో ఇటీవల ప్రారంభమైన 35వ జాతీయ ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ లాల్ కు చెందిన 'లాలిసోమ్' బ్యాండ్ సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications