కిరణ్ బేడీ చేరికే బీజేపీ పరాజయానికి కారణమా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలే వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. ఢిల్లీలో 'మఫ్లర్ మేన్' అరవింద్ కేజ్రివాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చరిత్ర సృష్టించారు.
రెండు నెలల ముందు వరకు బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా... కిరణ్ బేడీ చేరికతో అవి తారుమారయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు తారుమారయ్యాయి. ఢిల్లీలో కిరణ్ బేడీ తన ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ఓటర్లను ఎంత మాత్రం ఆకట్టుకోలేక పోయారని అంటున్నారు.
కిరణ్ బేడీ చేరికే బీజేపీ పరాజయానికి కారణమా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ రాజకీయ వర్గాలు. అటు ఢిల్లీ ఓటర్లు కూడా క్లీన్ ఇమేజ్ కలిగిన కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతే కాదు బేడీ రాకతో పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసింది. ముఖ్యంగా కృష్ణ తీరథ్ లాంటి సీనియర్ నాయకులతో బేడీకి సమన్వయం కుదురలేదు.
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడీని బీజేపీ ప్రకటించిన అతి పెద్ద తప్పు చేసిందని వన్ఇండియా చేసిన ఇంటర్యూలో డాక్టర్. సందీప్ శాస్త్రి వెల్లడించారు. ఢిల్లీలో కిరణ్ బేడీ బీజేపీ ఓటు బ్యాంకును పెంచడంలో ఏ మాత్రం దోహదపడ లేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పార్టీకి సారథ్యం వహించిన హర్షవర్దన్ లాంటి స్ధానికి నాయకుడు లేకపోవడంతో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం కూడా బీజేపీకి నష్టం కలిగించింది. గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ మేనిఫెస్టోకు బదులుగా విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసింది.
ఎన్నికల ప్రచారంలోకి పార్టీ సీనియర్ నాయకులను, కేంద్ర మంత్రులను దింపినా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపారు. అందుకు కారణం వారెవరూ స్థానిక నాయకులు కాకపోవడం వల్ల వారెవరికీ స్థానిక సమస్యలపై పట్టులేక పోవడం కూడా ఆప్కి కలిసి వచ్చింది.
బీజేపీ సారధి అమిత్ షా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆలస్యంగా ప్రారంభించారు. ఇక ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం నినాదం లాగే మిగిపోయిందని ప్రజలు భావించడం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనలో మోడీ 30 లక్షల విలువ చేసే కోటు ధరించడం కూడా బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపించదని అన్నారు.