పిలవని పేరంటం: పెళ్లి మంటపంలోకి వచ్చిన చిరుతపులి
లక్నో: వివాహ వేడుక జరుగుతుండటంతో హాజరైన వారందరూ ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నారు. అప్పుడే వచ్చింది.. ఓ అనుకోని అతిథి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ భయాందోళనకు గురై బెంబేలెత్తిపోయారు. అది మామూలు మనిషో.. జంతువో అయితే పర్లేదు కానీ, చిరుతపులి అయితే బెంబేలెత్తకుండా ఎలా ఉంటారు మరి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాబాద్ జిల్లాలోని ఠాకూర్ద్వారా జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఠాకుర్ద్వారాలో సమీపంలోని అడవి నుంచి చిరుతపులి పెళ్లి మంటపంలోకి వచ్చేసింది.
ఒక్కసారిగా పులిని చూసిన అతిథులంతా భయంతో పరుగులు పెట్టారు. దీంతో మంటపంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు అయితే తన తరపు బంధువులను తీసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయి పార్కింగ్ చేసివున్న ఓ బస్సులో దాక్కున్నాడు.
కాగా, ఘటన నుంచి కొద్ది సేపటికి తేరుకున్న పెళ్లి కూతురు కుటుంబసభ్యులు, బంధువులు ఇనుప రాడ్లు, కర్రలతో చిరుతను అక్కడ్నుంచి తరిమేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కొడుకును తీసుకొచ్చి పెళ్లి జరిపించారు.
ఈ ఘటనపై స్థానిక అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. చిరుతపులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. కాగా, ఉత్తరాఖండ్ సరిహద్దుగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నుంచి చిరుతపులి లాంటి కృర మృగాలు సమీపంలోని ఈ గ్రామాలకు తరచుగా వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇది చలికాలంలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.