లోక్సభ ఎన్నికలు 2019 : మీ ఓటు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలి?
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే దేశ పౌరులుగా ఓటు వేయడం అందరి బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ లేనట్లయితే ఓటు నమోదు చేసుకోవడానికి కింద పేర్కొన్న పద్దతుల ద్వారా దరఖాస్తు చేసుకోండి.
లోక్సభ ఎన్నికలు 2019 : మీ ఓటు చూసుకోవడం ఎలా?
ఓటుందా?
ఓటర్ల జాబితాను చాలామంది పట్టించుకోరు. ఓటు హక్కు ఎక్కడ పోతుందిలే అనే నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. కానీ కొన్ని కారణాలతో ఓటర్ లిస్టులోంచి మీ పేరు తొలగించి ఉండొచ్చు. లేదంటే మీరు ఇల్లు మారితే మీ ఓటు తీసివేయొచ్చు. ఇలా చాలా రకాలుగా ఓట్లు మిస్ అవుతుంటాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేని పక్షంలో మళ్లీ నమోదు చేసుకునేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆన్లైన్ పద్ధతి కాగా మరొకటి ఆఫ్ లైన్ పద్ధతి.
ఆన్లైన్ నమోదు
ఆన్లైన్ పద్ధతిలో ఓటు నమోదు చేసుకోవాలంటే.. మొదట https://eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అది ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ కార్నర్ లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ కావొచ్చు. అనంతరం కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే REGISTER NOW TO VOTE అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే రకరకాల సేవలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ కనిపిస్తుంది.
అందులో FORM 6 మీద క్లిక్ చేయాలి. వెంటనే వేరే విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఫోటో, వయసు ధృవీకరణ పత్రం (SSC Memo etc), అడ్రస్ ప్రూఫ్ అప్ లోడ్ చేయాలి. అనంతరం పూర్తిచేసిన FORM 6 డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి ఐడీ, అడ్రస్ ప్రూఫ్స్ జోడించి స్థానిక అంగన్ వాడీ సంతకం తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో అందించాలి. అక్కడి సిబ్బంది అన్నీ ధృవీకరించుకుని ఆమోద ముద్ర వేస్తే ఓటు వచ్చినట్లే. దరఖాస్తు సమర్పించినప్పుడు మీకు అప్లికేషన్ ఐడీ వస్తుంది. దాని ద్వారా ఆన్లైన్లోనే అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా మీ పేరు నమోదైనట్లు సమాచారం వస్తుంది. ఓట్ల నమోదుకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే EPIC (space ఇవ్వాలి) అప్లికేషన్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి 9211728082 ఫోన్ నెంబరుకు పంపించాలి.
ఆఫ్ లైన్ నమోదు
FORM 6 తీసుకుని దాన్ని పూర్తిగా నింపాక ఫోటో అతికించి వయసు ధృవీకరణ పత్రంతో పాటు అడ్రస్ ప్రూఫ్ జతపరుస్తూ ఎమ్మార్వో కార్యాలయంలో అందించాలి. అక్కడి సిబ్బంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి ఓటు నమోదు చేస్తారు. ఓటరుగా నమోదు కావాలంటే 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. తాము నివసించే ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు నమోదు చేసుకునే వీలు లేదు. ఒకవేళ అలా ఉండి అధికారుల దృష్టికి వస్తే తొలగిస్తారు.