జింతాపై అసభ్యంగా వాడియా: పోలీసులతో కమిషన్
ముంబై: పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై ప్రీతీ జింతా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర మహిళా కమిషన్ బృందం శనివారం ఉదయం మెరైన్ డ్రైవ్ పోలీసు అధికారులను కలిసింది. కమిషన్ చైర్పర్సన్ చిత్రా వా నేతృత్వంలో ఆ బృందం కలిసింది.
ప్రీతి జింతా చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి వాకబు చేయడానికి ఆ బృందం పోలీసు అధికారులను కలిసింది. ప్రీతి జింతా మెరైన్ డ్రైవ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మే 30వ తేదీన నెస్ వాడియా తన శరీరంలో తాకగూడని చోట్ల తాకాడని ఆమె ఆరోపించారు.
వాంఖడే స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తనను దూషించాడని ఆమె ఆరోపించారు. నెస్ వాడియా, ప్రీతి జింతా ఐపియల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమానులు. ప్రీతి జింతా ఫిర్యాదు చేసి 24 గంటలు దాటిపోతోందని, ఆమె ఫిర్యాదు తీసుకున్న చర్యలేమిటనేది తెలుసుకోవడానికి తాము వచ్చామని వా ఓ ప్రముఖ దినపత్రిక ప్రతినిధితో చెప్పారు.
సిసిటివి ఫుటేజ్లు తమ వద్దకు చేరాయని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నామని పోలీసులు చెప్పినట్లు ఆమె తెలిపారు. అది పూర్తయిన తర్వాత వాడియాను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె చెప్పారు.