బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కోవచ్చు?: ఓ కన్నేసి ఉంచామన్న కుమారస్వామి!
బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. అటు కాంగ్రెస్, జేడీఎస్, మరోవైపు బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఇరువురు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దీంతో ఇక గవర్నర్ నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉంటుంది.
మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సందర్భంగా జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతునిచ్చిందని తెలిపారు. అలాగే తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇదే విషయంపై సిద్దరామయ్య మాట్లాడుతూ.. 'ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చు' అని పేర్కొన్నారు. కాగా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు సరిపోదు.
మేజిక్ ఫిగర్ రావాలంటే మరో పార్టీ మద్దతు కావాల్సిందే. కానీ ఉన్న రెండు పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ జతకట్టడంతో బీజేపీకి సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.
అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోకుండా ఓ కన్నేసి ఉంచామని కుమారస్వామి చెబుతున్నారు. అవసరమైతే పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఒక్క జేడీఎస్ మాత్రమే కాదు కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.