2జీ: ప్రధానికి ముందే తెలుసు, అబద్దమన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ చీఫ్ వినోద్ రాయ్ గురువారం ‘టైమ్స్ నౌ'న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2జీ స్పెక్ట్రమ్ ద్వారా కేటాయింపుల కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 కోట్లు నష్టం వాటిల్లిన సంగతి తనకు తెలియదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం అబద్దమని అన్నారు. ఈ కుంభకోణం గురించి ఆయనకు ముందుగానే తెలుసునని అన్నారు.
కమల్ నాథ్ ఐతే ఈ విషయంలో లేఖల ద్వారా చాలా సార్లు హెచ్చరించారని పేర్కొన్నారు. ఈ 2జీ కుంభకోణంలో ప్రధాని గట్టిగా వ్యవహరించి ఉంటే అప్పటి టెలికాం మంత్రి ఎ రాజా చేసిన అడ్డగోలు 2జీ స్పెక్ట్రం కేటాయింపులను ఆపగలిగేవారని అన్నారు.
ఆడిట్ నివేదికల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ప్రస్దావన లేకుండా చేయడానికి కాంగ్రెస్ నేతలు సంజయ్ నిరుపం, సందీప్ దీక్షిత్, అశ్వనీ కుమార్ తనపై ఎన్నోసార్లు ఒత్తిళ్లు తీసుకువచ్చారని వినోద్ రాయ్ చెప్పారు. ఐతే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం ఈ ఆరోపణలను ఖండించారు. వినోద్ రాయ్ చేసిన ఆరోపణలు అబద్దమన్నారు. గతంలో తానెప్పుడూ రాయ్ని కలవలేదని అన్నారు.
వినోద్ రాయ్ ఇంటర్యూలో ముఖ్యంశాలు:
* 2జీ కుంభకోణంలో అప్పటి కేంద్రమంత్రి ఎ రాజా తన లేఖలను ప్రధానికే రాశారు. వాటికి ప్రధానే స్యయంగా జవాబులు రాశారు. నేను రాసిన లేఖలకు మాత్రం బదులివ్వలేదు.
* 2జీ కుంభకోణంలో నష్టాన్ని రూ. 1.76 లక్షల కోట్లుగా లెక్కగట్టడం సరికాదని 2010 నవంబర్ 16న మన్మోహన్ నాతో అన్నారు. మీరు నేర్పిన ఆర్దిక గణితశాస్త్ర పద్దతిలోనే లెక్కవేశానంటూ బదులిచ్చానని అన్నారు.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు విషయంలో క్యాబినెట్ స్దాయిలో నిర్ణయం జరగలేదు. ముకేశ్ అంబానీయే అంతా నడిపించారు.
* 2జీ కుంభకోణం జరక్కుండా ప్రధాని హోదాలో మన్మోహన్ చర్యలు తీసుకోని ఉండొచ్చు. కానీ ఆయన ఆ పని చేయలేదు.
* కోల్ బ్లాక్ కేటాయింపులో ఉన్న లోపాలను, దిద్దుబాటు చర్యలను గురించి నేను, ప్రణబ్ ముఖర్జీతో కలిసి మన్మోహన్ సింగ్కి వివరించినా ప్రయోజనం లేకపోయంది.