నేను ట్వీట్ చేస్తేనే కొయిరాలకు తెలిసింది: నేపాల్ భూకంపంపై మోడీ
న్యూఢిల్లీ: తాను ట్వీట్ చేస్తేనే భూకంపం గురించి నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలకు తెలిసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. బుధవారం మీడియాతో ఆయన ఆ విషయం చెప్పారు. భూకంపం వచ్చిన సమయంలో సుశీల్ కోయిరాల థాయ్లాండ్ పర్యటనలో ఉన్నారు. తన ట్విట్ ద్వారానే భూకంపం గురించి తెలుసుకున్నట్లు కొయిరాల తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాను సంబంధాల్లో ఉన్నాను కాబట్టి తనకు భాకంపం గురించిన సమాచారం అందిందని మోడీ చెప్పారు. పార్లమెంటరీ ప్రక్రియపై జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్థరాత్రి దాటిన మర్నాడు తెల్లవారు జామున 3.15 గంటలకు తనకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడని, చాలా ఏళ్ల క్రితం తాను ఆ వ్యక్తితో మధ్యాహ్న భోజనం చేశానని, అతను తన నెంబర్ పెట్టుకున్నాడని, తనకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని అతను ఫోన్ చేసి చెప్పాడని, తన ఇళ్లు ట్రాక్కు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందని, బహుశా రైలు ప్రమాదం జరిగి ఉంటుందని అతను తనకు చెప్పాడని మోడీ వివరించారు.
తాను వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశానని, అప్పటికి జిల్లా కలెక్టర్కు గానీ జిల్లా యంత్రాంగానికి గానీ రైలు ప్రమాదం గురించి ఏ విధమైన సమాచారం లేదని, తనకు తెలిసింది కాబట్టి 20 నిమిషాల్లో సహాయక బృందాలను పంపించానని ఆయన చెప్పారు.
దాంతో ఉదయానికల్లా గాయపడినవారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, తాను ఉదయమే సంఘటనా స్థలాన్ని సందర్శించానని, పరిస్థితి చక్కబడిందని ఆయన చెప్పారు. బహుశా మీడియా తీవ్ర అసంతృప్తికి గురై ఉంటుందని, ఫొటోలు తీయడానికి ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవని ఆయన అన్నారు. అప్పటి రైల్వే మంత్రి చాలా ఆలస్యంగా సాయంత్రం వచ్చారని, బాధితులు లాలూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, రాళ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు.
మోడీ తనపై మంచు ఇటుకలు విసిరారని, మంచు కరిగిపోయిందని, దాంతో దాడికి సంబంధించిన ఏ విధమైన సాక్ష్యాలు లేకుండా పోయాయని లాలూ అన్నారని మోడీ నవ్వుతూ చెప్పారు.
జర్నలిస్టులు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని, అయితే ప్రభుత్వ ప్రయోజనాల కోసం కాదని ఆయన అన్నారు. తూకం రాళ్లతో మీడియా వార్తల విలువలను కొలవాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రారంభిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని ఆయన అన్నారు.