వాతావరణం రిపోర్ట్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, మహారాష్ట్ర-గోవాలలో భారీ వర్షం
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు శుక్రవారం (జూన్ 8) మహారాష్ట్రకు విస్తరించాయి. ఇప్పటికే ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముంబై, గోవాలలోను వర్షాలు కురవనున్నాయి. కోస్తా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముంబై నగరంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగాలు తమ సెలవులను రద్దు చేసుకున్నారు.
సెంట్రల్ అరేబియా, గోవా, కర్ణాటక, రాయలసీమలలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కొంకణ్లోని పలు ప్రాంతాలు, దక్షిణ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, విదర్భ, దక్షిణ చత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, తెలంగాణ మొత్తం, కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలోని వెస్ట్ సెంట్రల్ ప్రాంతంలో, ఉత్తర బంగాళాఖాతంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్లోని దక్షిణ ప్రాంతం, చత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్నిచోట్ల, సిక్కిం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు రానున్న 48 గంటల్లో మరింత విస్తరించనున్నాయి.
ముంబై తదితర ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ సీజన్లో సెంట్రల్ ఇండియాలో సాధారణ వర్షపాతం, దక్షిణాది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం 101 శాతం ఉటుందని తెలిపింది.