అమీర్ఖాన్ బాధేంటో తెల్సుకోండి: మోడీకి ములాయం
లక్నో: భారత్లో తీవ్ర అసహనం ఉందని, ఓ సందర్భంలో తన భార్య ఈ దేశం నుంచి వెళ్లిపోదామన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన పైన నెటిజన్లు, బిజెపి మండిపడుతోంది. రామ్ గోపాల్ వర్మ సహా పలువులు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్... అమీర్ ఖాన్కు మద్దతు పలికారు. దేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ములాయం వ్యాఖ్యానించారు. అమీర్ వ్యాఖ్యలు కొంతమందిని బాధపెట్టి ఉండవచ్చునని, కేంద్ర ప్రభుత్వం అమీర్ ఖాన్తో మాట్లాడాలన్నారు.
అతడి వ్యాఖ్యల వెనుక ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. అయినా దేశంలో ఏ వ్యక్తికి అయినా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. ఆయన అలా అన్నారంటే ఏదో బాధపెట్టి ఉంటుందని ములాయం అభిప్రాయపడ్డారు.
దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థిలు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచన చేసిందని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై చాలామంది మండిపడుతున్నారు. అద్భుతమైన భారత్ కాస్తా అసహన భారత్గా ఎప్పుడు మారిందని అనుపమ్ ఖేర్, రాం గోపాల్ వర్మ, రవీనా టాండన్ తదితరులు అమీర్ ఖాన్కు కౌంటర్ ఇచ్చారు.
కాగా, ఇటీవలి వరకు పలువురు సాహితీవేత్తలు తమ అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు మత అసహనం అంటూ కొత్త వాదానికి తెరలేపారని, సిక్కుల ఊచకోత, తస్లీమా నస్రీన్ పైన దాడి తదితర సంఘటనల సమయంలో వారేం చేశారని బిజెపి ప్రశ్నిస్తోంది.
అవార్డులు వాపస్ ఇచ్చిన వారి పైన బిజెపి ఎంపీ రామేశ్వర్ తేలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారు ఒక్కొక్కరు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు డబ్బులు తీసుకుంటుని అలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బిజెపి అధిష్టానం మందలించడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.