కుమారస్వామి కీలక నిర్ణయం: ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తిని నియమిస్తామని వెల్లడించారు. ఈ నెల 6న జయ నగర్లోని నారాయణమూర్తి నివాసంలో ఆయనను కుమారస్వామి కలిశారు.
బుధవారం కుమార స్వామి మాట్లాడుతూ... నారాయణమూర్తిని ప్రణాళిక మండలి సారథిగా నియమించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగడంతోపాటు కర్ణాటకకు పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చునని చెప్పారు. మరికొందరు ప్రముఖ నిపుణులను కూడా సభ్యులుగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
కుమారస్వామి అంతకుముందు రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కనుక అవినీతిని నిర్మూలించేందుకు నడుం బిగిస్తే తొలుత తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి వ్యవస్థే ఉందన్నారు. సమాజంలో పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు.
ప్రభుత్వం తమకేమీ చేయకపోయినా పర్వాలేదు కానీ, సమాజంలోని అవినీతిని రూపుమాపాలని శృంగేరీ పీఠాధిపతి తనకు సూచించినట్లు చెప్పారు. అయితే, అది అంత సులభమైన పని కాదన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని ఉపయోగించి అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.
తనకు పూర్తిస్థాయిలో మెజారిటీ లేనందున కఠిన నిర్ణయాలను తీసుకునే పరిస్థితి లేదన్నారు. తాను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని, డబ్బు సంపాదించాలన్న ఆశ, ఆసక్తి కూడా లేవన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తిగా పనిచేసి పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తన తండ్రి తనకు సీఎం కావడం ఇష్టం లేదని, కానీ కాంగ్రెస్ తనకే అప్పగించిందన్నారు.












Click it and Unblock the Notifications