ఎయిర్పోర్టులో 1.34కోట్లు సీజ్: అన్ని కొత్త రూ.2000 నోట్లే!
చెన్నై విమానాశ్రయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రూ. 1.34కోట్ల నగదును పట్టుకున్నారు.
చెన్నై: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి అక్రమార్కులు తమ అక్రమ సొమ్మును మార్చుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ నిఘా అధికారులు అప్రమత్తతో వ్యహరిస్తుండటంతో వారి ఆటలు సాగడం లేదు.
తాజాగా, చెన్నై విమానాశ్రయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రూ. 1.34కోట్ల నగదును పట్టుకున్నారు. దీంతోపాటు 7వేల అమెరికన్ డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, ఈ మొత్తంలో అన్ని కొత్త రూ. 2000ల నోట్లే ఉండటం గమనార్హం. ఈ మొత్తం ఎవరికీ చెందినది, ఎవరికీ ఇచ్చేందుకు తీసుకుపోతున్నారు? అంటూ ఆ ఐదుగురు వ్యక్తులను అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఈ సొమ్మంతా హవాలా సొమ్మేనని అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల నెంబర్లను గుర్తించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.