యూపీ సారథి: మౌర్య వర్సెస్ దినేశ్ శర్మ, ఐబీ నివేదిక రిపోర్ట్ ఇది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక స్థాయిలో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు రూపొందించాల్సిన ఫార్ములాపై సతమతమవుతున్నది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక స్థాయిలో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు రూపొందించాల్సిన ఫార్ములాపై సతమతమవుతున్నది. యుపి ముఖ్యమంత్రి పీఠం కోసం పలువులు పోటీ పడుతున్నారు.
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో తదుపరి సీఎం ఎంపికతోనే తమ పునాదిని బలోపేతం చేసుకోవాలని కమలనాథుల ఎత్తుగడ. అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, ఓబీసీలు, అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) మద్దతు పొందడం బీజేపీకి రాజకీయంగా ఎంతో కీలకం.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్న బిజెపి.. వారి ఆకాంక్షలు నిరంతరం నిలుపుకోవడమెలా? అన్న అంశంపై డైలమాలో పడింది. ప్రగతి అనుకూల ఎజెండా ముందుకు సాగుతున్న బీజేపీ నాయకత్వం.. ప్రజల ఆకాంక్షలకు తోడుగా, ఆయా సామాజిక వర్గాల మద్దతు కొనసాగించగల సామర్థ్యం గల నాయకుడెవరు? అన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు.
మోదీ - అమిత్ షా పరిశీలనాంశాలివి..
ప్రస్తుత ఎన్నికల్లో సొమ్ముచేసుకున్న వివిధ సామాజిక వర్గాల మద్దతును 2019 లోక్సభ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని భావిస్తున్న బీజేపీకి అసలు పరీక్ష ప్రారంభం కానున్నది. ఈ పరిస్థితుల్లో తమ తదుపరి సీఎంగా ఎవరిని ఎంపికచేస్తారన్న విషయమై యూపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సరైన నాయకుడు ఎవరో గుర్తించాలని చేసిన సూచన మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో యూపీలో వివిధ వర్గాల అభిప్రాయాలతో ప్రధాని నరేంద్రమోదీకి సవివరమైన నివేదికను అందజేసింది. ఈ పరిస్థితుల్లో మోదీ, అమిత్ షా అభిమానాన్ని చూరగొనే అవకాశం గల నేతలు పలువురు ఉన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మనస్సు చూరగొన్న నేత ఎవ్వరన్నది తెలుసుకోవాలంటే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే. అందుకు అవకాశాలు గల నేతల గుణ గణాలు, శక్తి సామర్థ్యాలు ఒకసారి పరిశీలిద్దాం..
కేశవ్ ప్రసాద్ మౌర్యకు అవకాశాలు
మరో రెండేళ్లలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎంబీసీ, ఓబీసీల మద్దతు కూడగట్టగల సామర్థ్యం గల నేత కావాలంటే కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు ప్రముఖుంగా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తానూ సీఎం రేసులో ఉన్నానని పేర్కొన్న మౌర్య.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అదే సమయంలో సుదీర్ఘంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో అనుబంధం గల నేత మౌర్య.
మౌర్యకు మంచి పేరు...
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ)లో ఆఫీస్ బేరర్ పని చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్యను బీజేపీ నాయకత్వం పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మంచి సంస్థాగత నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీకి ఇష్టమైన నాయకుడిగా అభిమానం సంపాదించుకున్నారు. సంప్రదాయ మద్దతుదారులైన అగ్ర కులాల వారితోపాటు అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) మద్దతు కూడగట్టగల సామర్థ్యం ఉన్న నేతగా మిగతా నాయకుల కంటే ముందు వరుసలో ఉన్నారు.
వాళ్ల ఫేవరేట్ మనోజ్ సిన్హా
సీఎంగా పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్న నేతల్లో కేంద్ర రైల్వే, టెలికం శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఏడాది కాలంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు ఫేవరెట్గా నిలిచారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన ఈ భూమి హర్ బ్రాహ్మణ సామాజిక వర్గ నేతగా, పాలనాదక్షత గల నాయకుడిగా పేరుంది. గ్రామాల్లో సామాన్యులతో మమేకమైన నేతగా పేరొందారు.
నిరాండంబరతకు మారుపేరు
కేశవ్ ప్రసాద్ మౌర్య, మనోజ్ సిన్హాలతోపాటు సీఎం పదవిని ఆశిస్తున్న మరో నేత లక్నో మేయర్ దినేశ్ శర్మ కూడా ఉన్నారు. ఆడంబరాలకు అతీతంగా, నిరాడంబరంగా ఉన్న నేతగా పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు బ్రాహ్మణ నాయకుడు కూడా. మనోజ్ సిన్హా మాదిరిగానే మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయికి అత్యంత సన్నిహితుడన్న పేరున్నది. ఒకవైపు మేయర్ గా పనిచేస్తూనే మరోవైపు లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా దినేశ్ శర్మ గుజరాత్ పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తూ అమిత్ షా ద్రుష్టిలో పెడ్డారు.
ఆయనకు అవకాశాలివీ...
తదనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర నాయకత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదికలోనూ దినేశ్ శర్మ పేరు ఉన్నదంటే అతిశేయోక్తి కాదు. గతేడాది అక్టోబర్లో లక్నో నగరంలోని రాంలీలా మైదాన్లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘జై శ్రీరాం' అన్న సభికుల నినాదాలతో మంత్ర ముగ్ధులు అయ్యారు. దినేశ్ శర్మను ‘యశస్వి'గా మోదీ పేర్కొన్నారంటే అంటే ఆయనపై అభిమానం చూపారు. ఆరెస్సెస్ తో సంబంధం గల కుటుంబం నుంచి వచ్చిన వారే దినేశ్ శర్మ. అంతే కాదు త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను దినేశ్ శర్మకు అప్పగించాలని అమిత్ షా భావిస్తున్నారంటే ఆయన ఎంత సమర్థుడో అవగతమవుతుంది.
తటస్థ ‘కాయస్థ' సిద్ధార్థనాథ్
ఇక మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. టీవీ చానెళ్లలో జరిగే చర్చల్లో కీలకంగా పాల్గొనడంతోపాటు బిజెపి తరఫున సమర్థవంతంగా వాణిని ప్రజల దరికి తీసుకెళ్లడంలో దిట్ట. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. యూపీలో తటస్థ వైఖరి ప్రదర్శించే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనోజ్ సిన్హా, కేశవ్ ప్రసాద్ మౌర్యల మాదిరిగా ఎంపీగా కాక ఎమ్మెల్యేగా గెలుపొందిన సిద్ధార్థ్ నాథ్ సింగ్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఘనత సాధించారు. ఇక ఎల్బీ శాస్త్రి మనుమడిగా ఆయన పేరు మిగతా వారితో సమానంగా బీజేపీ పరిశీలనలో ఉన్నదన్న మాటలు వినిపిస్తున్నాయి.
పరిశీలనలో రాజ్నాథ్ పేరు
గతంలో సీఎంగా పని చేసి.. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ నాథ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నాయకత్వం గట్టిగానే పరిశీలిస్తోంది. అయితే తాను సీఎం పదవి రేసులో లేనని ముందే చెప్పారు. ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడిగా.. రాష్ట్ర పాలనా సామర్థ్యంలో అనుభవం గల నేతగా ఆయనకు పేరు ఉన్నది. లక్నో లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్నాథ్ రాష్ట్రంలోని 2002 మార్చిలో సీఎంగా వైదొలిగిన తర్వాత జాతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. రెండు దఫాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. అత్యంత క్రమశిక్షణ గల నాయకుడిగా 1964 నుంచి సంఘ్తో అనుబంధం నేతగా, కింది స్థాయిలో జనంతో సన్నిహిత సంబంధాలు గల నేత.
ఆరెస్సెస్ కు సన్నిహితుడిగా...
గౌతంబుద్ధ నగర్ స్థానం నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికైన మహేశ్ శర్మ.. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో పర్యాటకశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. నొయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసిన మహేశ్ శర్మ ‘ఆరెస్సెస్'కు అత్యంత సన్నిహితులు.
సంతోష్ గంగ్వార్
మోదీ క్యాబినెట్లో మంత్రిగా పని చేస్తున్న సంతోశ్ గంగ్వార్ పేరు కూడా యూపీ సీఎం పదవికి పరిశీలిస్తున్న పేర్లలో ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 2.4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1989లో బీజేపీ యూపీ పదాధికారుల కమిటీలో సభ్యుడిగా.. 1999లోనే కేంద్రమంత్రిగా సేవలందించారు.