కాలేజీ అమ్మాయిలను ప్రలోభపెట్టా, వారి కోసమే: నిర్మలాదేవి
చెన్నై: సస్పెండైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి అమ్మాయిలను ప్రలోభ పెట్టేదని సీబీసీఐడీ మద్రాస్ హైకోర్టులో రిపోర్ట్ను దాఖలు చేసింది. తాను విద్యార్థులను ప్రలోభపెట్టిన మాట నిజమేనని స్వయంగా ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీసీఐడీ పేర్కొంది.
అరుప్పుకోట దేవాంగర్ కళాశాల సహాయ ఆచార్యురాలు నిర్మలాదేవి, సహాయ ఆచార్యుడు మురుగన్, పీజీ విద్యార్థి కరుప్పస్వామి తదితరులు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసును సీబీసీఐడీకి బదులు మహిళా డీఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన న్యాయస్థానం ఈ కేసు విచారణ ప్రస్తుతస్థితి గురించి నివేదిక అందించాలని సీబీసీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ అధికారి నివేదిక దాఖలు చేశారు. అందులో నిర్మలాదేవి, మురుగన్, కరుప్పస్వామిలు విద్యార్థినులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన మాట నిజమేనని నిర్మలాదేవి వాంగ్మూలం ఇచ్చిందన్నారు.
మురుగన్, కరుప్పస్వామి కోసమే ఈ పని చేసినట్లు ఆమె చెప్పారని తెలిపారు. విద్యార్థినులతో నిర్మలాదేవి ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇంతవరకు 160 మందిని విచారించినట్లు తెలిపారు. ముగ్గురి ఇళ్ల నుంచి సిమ్ కార్డులు, మెమొరీ కార్డులు, లాప్ట్యాప్ తదితర ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ పరిశోధనలు చేశామని, త్వరలో విచారణ ముగుస్తుందన్నారు.