ఢిల్లీ ఎన్నికలకు బిజెపి విజన్ డాక్యుమెంట్: ప్రతీరోజూ కేజ్రివాల్కు ప్రశ్నలు
న్యూఢిల్లీ: తమ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టో ఏదీ విడుదల చేయబోదని, కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అనంతకుమార్ తెలిపారు. ఆ విజన్ డాక్యుమెంట్ను ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కలిసి విడుదల చేస్తారని చెప్పారు.
‘బిజెపి ఈసారి మేనిఫెస్టో విడుదల చేయదు, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం అభ్యర్థి బేడీ కలిసి విజన్ డాక్యుమెంట్ మాత్రమే విడుదల చేస్తారు' అని అనంతకుమార్ తెలిపారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 3, 4 తేదీల్లో మోడీ నాలుగు ర్యాలీల్లో ప్రసంగిస్తారని చెప్పారు.
ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రతి రోజూ తమ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్కు ఐదు ప్రశ్నలు వేస్తుందని ఢిల్లీ బిజెపి చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. మేనిఫెస్టోకు తమ పార్టీ విజన్ డాక్యుమెంట్కు తేడా ఏమి ఉండదని చెప్పారు. భద్రతా పరమైన అంశాలు తమ విజన్లో ముఖ్యంగా ఉంటాయని బిజెపి నేతలు తెలిపారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్రమంత్రులతోపాటు అగ్రనేతలతో భేటీ అయ్యారు. 13 రాష్ట్రాలకు చెందిన 120 మంది పార్లమెంటు సభ్యులు ఫిబ్రవరి 7న జరగనున్న ఎన్నికల కోసం ఢిల్లీ ప్రచారం నిర్వహిస్తారని బిజెపి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు 10న వెల్లడి కానున్నాయి.