దీపా జయకుమార్కు షాక్, శశికళకే జయలలిత అల్లుడి మద్దతు
జయలలిత వారసురాలు శశికళనే అని, ఆమె తప్ప ఇంకెవరు వచ్చినా తాను అడ్డుకుంటానని జయ మేనల్లుడు దీపక్ అన్నారు. ఆయన ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
చెన్నై: జయలలిత వారసురాలు శశికళనే అని, ఆమె తప్ప ఇంకెవరు వచ్చినా తాను అడ్డుకుంటానని జయ మేనల్లుడు దీపక్ అన్నారు. ఆయన ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంజీఆర్ సమాధి వద్ద జయ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు శశికళతో పాటు ఓ యువకుడు అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు. అతనే ఈ దీపక్. ఇతను జయ సోదరుడు జయరామన్ కుమారుడు.

పోయెస్ గార్డెన్ వెళ్తుండేవాడిని
అన్నాడీఎంకే వారసుల అంశంపై దీపక్ ఓ పత్రికతో స్పందించారు. తాను తరుచూ పోయెస్ గార్డెన్కు వచ్చి వెళ్తుండేవాడినని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు జయకు చికిత్స జరిగితే ఐదు రోజులు మినహాయించి అన్ని రోజులు ఆమె వెంటే ఉన్నానని చెప్పారు.

జయలలితతో తగాదాలు లేవు
తమ అత్తకు తమ కుటుంబంతో ఎలాంటి గ్యాప్ లేదన్నారు. చిన్న తగాదాలు సహజమే అని, అవి అప్పుడే సమసిపోయేవని చెప్పారు. అత్త ఎప్పుడు పిలిచినా పోయెస్ గార్డెన్ వెళ్లేవాడినని, తాను రాజకీయ జీవితంలో తలదూర్చలేదని చెప్పారు.

అత్తకు కనిపించకుండా ఇంటికెళ్లేవాడిని
నాలుగు నెలల క్రితం పోయెస్ గార్డెన్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఆ పూజలో సంకల్పం కోసం తనను పిలిపించారన్నారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, రాత్రి తిరిగి ఇంటికి వెళ్లానని దీపక్ చెప్పారు. పోయెస్ గార్డెన్లో తన అత్త జయలలిత క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య ఓ రోబోలా ఉండటం తనకు కష్టమనిపించేదని, ఆ కారణం వల్లే అత్త జయకు కనిపించకుండా ఇంటికి పోయేవాడినని చెప్పారు.

సోదరి దీపా జయకుమార్ పైన..
తన సోదరి దీపా జయకుమార్ తనకు తానుగా అగాథం సృష్టించుకున్నారని చెప్పారు. తాను తరుచూ అత్త జయతో మాట్లాడుతుండేవాడిని, తన సోదరి దీప మాత్రం అలా చేయలేదన్నారు. దీంతో మనస్పర్థలు పెరిగాయన్నారు. దీప రాజకీయాల్లోకి రావొద్దని కోరుకుంటున్నానని, కానీ అది ఆమె వ్యక్తిగత విషయమన్నారు.

శశికళపై ఆరోపణల మీద..
జయలలిత మృతి విషయంలో శశికళ పైన వచ్చే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. అదే సమయంలో తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ శశికళకు మద్దతు ప్రకటిస్తే నేను అమ్ముడుపోయానని మీరే వార్తలు రాస్తారని వ్యాఖ్యానించారు. శశికళ పట్ల జయలలితకు విశ్వాసం ఎక్కువ అన్నారు. కేవలం నాలుగు నెలలు మినహా.. శశికళను అత్త జయలలిత 34 ఏళ్లపాటు విశ్వాసపాత్రురాలిగానే చూశారన్నారు. జయలలిత మృతిలో ఎలాంటి కుట్ర లేదన్నారు.

ఆసుపత్రిలో అడ్డుకోవడంపై..
అపోలో ఆసుపత్రిలో దీపా జయకుమార్ను పోలీసులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే విషయమై దీపక్ స్పందిస్తూ.. అత్త జయలలిత ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజు తనను కూడా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అత్త ఆస్తులు ఎవరికి చెందాలో వారికి చెందుతాయన్నారు. కానీ చెడ్డవారి చేతుల్లోకి వెళ్లవద్దన్నారు.












Click it and Unblock the Notifications