మా వల్లే లోకసభలో రగడ: రాజ్నాథ్కు ఔట్లుక్ 'సారీ'
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ఔట్లుక్లో వచ్చిన కథనం వేడి రాజేసింది. దీంతో, ఔట్లుక్ సోమవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు క్షమాపణ చెప్పింది. 800 ఏళ్ల తర్వాత హిందూ వ్యక్తి ప్రధాని అయ్యారని రాజ్నాథ్ ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చింది.
సోమవారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. 800 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో అసలైన హిందూ పాలకుడు వచ్చాడంటూ రాజ్నాథ్ను ఉద్దేశించి సలీం వ్యాఖ్యానించడంతో రభస మొదలైంది.
తనపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించిన సలీం బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజ్నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తామేమీ సొంతంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, రాజ్నాథ్వ వ్యాఖ్యానించిందంటూ.. అందుకు సాక్ష్యంగా ఔట్ లుక్ పత్రిక ప్రతిని చూపారు.
దీంతో, ఒక్కసారిగా ఔట్ లుక్ అప్రమత్తమైంది. హిందూ పాలకుడి వ్యాఖ్యలు రాజ్నాథ్ చేసినట్లుగా పొరపాటుగా ప్రచురించినట్లు ఔట్ లుక్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలు దివంగత విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చేశారని తేలింది. అయితే అశోక్ సింఘాల్ పేరుకు బదులుగా రాజ్నాథ్ పేరును ప్రచురించినట్లు గుర్తించి నాలిక్కరచుకుంది.
వెంటనే క్షమాపణలు చెబుతూ ఔట్ లుక్ ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేసింది. ‘జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. పార్లమెంటును గాని, హోం మంత్రిని గాని అగౌరవపరచాలన్నది మా అభిమతం కాదు. మా పొరపాటు వల్ల రాజ్నాథ్, సలీంల మధ్య జరిగిన వాగ్వాదానికి చింతిస్తున్నామ'ని ఆ పోస్ట్లో విచారం వ్యక్తం చేసింది.