గుజరాత్ తీరంలోకి వచ్చిన పాక్ పడవ: రూ. 600కోట్ల హెరాయిన్ సీజ్
గాంధీనగర్: పాకిస్థాన్కు చెందిన ఓ పడవ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ తీరంలోకి చేరుకుంది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ పడవను భారత నావికా దళం సోమవారం గుర్తించింది. ఆ పడవను పోర్బందర్కు తీసుకెళ్లిన నావికా దళం విచారణ జరుపుతోంది.
కాగా, ఆ పడవలో 100 కిలోల హెరాయిన్ ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పడవలో 8మంది మత్తు పదార్థాలను సరఫరా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
అనుమానాస్పదంగా తిరుగుతున్నందునే అదుపులోకి తీసుకోవడం జరిగిందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. భారత జలాల్లో ఆ పడవ ఎందుకు సంచరిస్తుందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. విచారణ అనంతరం పూర్తి వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.
గత రెండు మూడు రోజులుగా రెండు నేవీ నౌకలు, ఓ కోస్ట్ గార్డ్ నౌక సదరు పడవను గమనించినట్లు తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకే ఆ పడవ భారత జలాల్లోకి వచ్చిందా? అనే కోణంలో నేవీ విచారణ కొనసాగిస్తోంది. భారత జలాల్లోకి రావడంతో పడవను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ తీరంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఇలాంటి పడవలను పంపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 31, 2014లో కూడా ఓ పడవ గుజరాత్ తీరం సమీపంలోకి వచ్చి భారత నేవీ వెంబడించడంతో పడవను పేల్చుకున్న విషయం తెలిసిందే.