ఉద్యోగులకు షాకిచ్చిన అనిల్ అంబానీ.. ఆర్ కామ్ లో 600 మందికి పింక్ స్లిప్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఆర్కామ్) ఏడాదికి రూ.30-50 లక్షల మధ్య వేతనం తీసుకుంటున్న మిడిల్, సీనియర్ మేనేజర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
ముంబై: అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఆర్కామ్) ఉద్యోగులకు కోలుకోలేని షాకిచ్చింది. రూ.30-50 లక్షల మధ్య వేతనం తీసుకుంటున్న మిడిల్, సీనియర్ మేనేజర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఇందులో భాగంగా 600 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది షాకేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణం ఏర్పడింది. టారిఫ్ వార్ లో ఒకదాన్ని మించి మరో సంస్థ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రవేశపెడుతున్న తరుణంలో గతంలో కన్నా లాభాలు బాగా క్షీణించాయనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే దేశంలోనే నాలుగో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ఆర్కామ్ ప్రస్తుతం ఎయిర్సెల్, ఎంటీఎస్తో విలీన చర్చలు కూడా జరుపుతోంది. ఇది ఒక కొలిక్కి రాకమునుపే ఉద్యోగులను తొలగించడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటనేది తెలియరాలేదు.
ఉద్యోగులను తొలగించడం ద్వారా సంస్థ మరింత బలోపేతం అవుతుందని ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంటీఎస్, ఎయిర్సెల్ సంస్థలు ఆర్కామ్లో విలీనమైతే 7500 మంది ఉద్యోగులతో సంస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన వివరించారు.