పొరపాటు!: శివసేన గుర్తుకు ఓటేయమని రాజ్ థాకరే
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాన సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే.. మంగళవారం ఎన్నికల ప్రచారంలో శివసేన పార్టీ గుర్తు అయిన విల్లు, బాణంకు ఓటేయాలని వ్యాఖ్యానించారు. రాజ్ థాకరే శివసేన నుండి బయటకు వచ్చి ఎంఎన్ఎస్ స్థాపించిన విషయం తెలిసిందే. గతంలో పలు ఎన్నికల్లో ఆయన పార్టీ సత్తా చాటింది.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోను సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే, మంగళవారం మరట్వాడా రీజియన్లోని లాతూర్ జిల్లా నిళంగలో రాజ్ థాకరే మాట్లాడుతూ.. యారో (బాణం) గుర్తుకు ఓటేయాలని పొరపాటుగా చెప్పారు. అంతలోనే సరిదిద్దుకొని రైలు ఇంజిన్ గుర్తుకు ఓటేయాలన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ గుర్తు రైలింజన్.
కాగా, బాణం గుర్తుకు ఓటు వేయాలని రాజ్ థాకరే పొరపాటుగా చెప్పిన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. రాజ్ థాకరే కూడా శివసేన గెలుపు కోరుకుంటున్నారని శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యంగ్యంగా అంటున్నారు. గుండె ఏం చెబుతుందో.. రాజ్ థాకరే నోటి నుండి అవే వ్యాఖ్యలు వచ్చాయని, శివసేన పార్టీ గుర్తు బాణంకు ఓటు వేయమని చెప్పారని శివసేన మద్దతుదారులు సామాజిక అనుసంధాన వెబ్సైట్లో పెట్టారు.
విదర్భపై బీజేపీ వైఖరిలో మార్పు!
కాగా, ఎప్పటి నుండో ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఉండాలంటూ డిమాండ్ చేస్తున్న బిజేపీ హఠాత్తుగా శివసేనతో సంబంధాలను తెంచుకోవడం ప్రత్యేక విదర్భ మద్దతుదారుల్లో ఓ రకమైన ఆసక్తికి, తెలియని ఉత్సాహానికి కారణమైంది. అయితే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడ కూడా బీజేపీ ప్రత్యేక విదర్భ ప్రస్తావన తేలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉన్న 62 అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ఓట్ల వాటాను 36.6 శాతానికి బీజేపీ పెంచుకుంది.
ప్రత్యేక విదర్భ కోసం అనుకూలంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు అందుకోసం పట్టుబడితే నష్టపోవాల్సి వస్తుందేమోననే భయంతో దాని ఊసెత్తకపోయి ఉంటుందని అంటున్నారు. మహారాష్ట్ర విభజన పైన వచ్చిన తేడాలే బీజేపీతో సంబంధాలు తెంచుకోవడానికి కారణమని శివసేన ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. తమ పట్ల వ్యతిరేకతకు ఏర్పడవచ్చునని బీజేపీ భావించి ఉంటుందని అంటున్నారు.
ఈ కారణంగానే విదర్భ పైన బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ప్రధాని మోడీ మంగళవారం తన ప్రచారంలో.. తాను ఉన్నంత వరకు మహారాష్ట్రను ఎవరు విడదీయలేరని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ప్రత్యేక విదర్భ కావాలని నినదించిన బీజేపీకి లోకసభ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో అత్యధిక ఓట్లు లభించినప్పటికీ.. విభజనకు వ్యతిరేకత చూపుతున్న శివసేనకే ఓట్లు బాగా పడ్డాయి. దీనిని కూడా బీజేపీ పరిగణలోకి తీసుకొని ఉంటుందని అంటున్నారు.