'భారతరత్న'లపై సచిన్, మాలవ్యాకు సరికాదన్న రామచంద్ర గుహ
న్యూఢిల్లీ: దేశానికి పండిట్ మదన్ మోహన్ మాలవ్యా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపే ఈ భారతరత్న అని భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బుధవారం అన్నారు. వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న వచ్చిన విషయం తెలిసిందే.
మాలవీయకు మరణానంతరం భారతరత్న ప్రకటించడం సమర్థనీయం కాదని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. అటల్ బిహారీ వాజపేయికి పురస్కారం సమంజసమే అయినా మదన్ మోహన్ మాలవ్యాకు ఇవ్వడం సరికాదన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ నాయకుడైన ఆయనకన్నా ఇంకా ఎందరో మహనీయులు ఉన్నారని, ఇక మరణానంతరం భారతరత్న పురస్కారాలు వద్దని చెప్పారు.
రవీంద్రనాథ్ ఠాగూర్, జ్యోతిబా ఫూలే, బాలగంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే, వివేకానంద స్వామి, అక్బర్, ఛత్రపతి శివాజీ, కబీర్, అశోక సామ్రాట్, గురునానక్ల పేర్లు కూడా వస్తాయన్నారు. చనిపోయిన వారికి ఇవ్వడం ఇంతటితో ఆపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వ్యాఖ్యలపై ప్రతివ్యాఖ్యలు చేశారు. అయితే, వారెవరూ ప్రధాని నియోజకవర్గ పరిధిలో నివసించడంలేదంటూ ఎద్దేవా చేశారు.
ఆనందదాయకం: నరేంద్ర మోడీ
మాలవ్యా, వాజపేయిలకు భారతరత్నను ప్రకటించడం అత్యంత ఆనందదాయకమైన విషయమని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. వారి అపురూపమైన సేవలకు అందిస్తున్న దీటైన గౌరవం ఇది అన్నారు.
మాలవ్యా,వాజపేయిలకు భారత రత్న పురస్కారాలను ప్రదానం చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా అన్ని పార్టీల నేతలు ప్రశంసించారు. మాజీ ప్రధాని వాజపేయిని భారత రత్న పురస్కారంతో సత్కరించాలన్న ప్రభుత్వ నిర్ణయం తనకెంతో సంతోషాన్ని కలిగించందని వాజపేయితో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ అన్నారు.
వాజపేయికి అభినందనలు తెలియజేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జెడి(యు) నాయకుడు నితీశ్ కుమార్, యుపిఏ ప్రభుత్వమే వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. దేశానికి వాజపేయి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని, అటల్జీకి భారత రత్న ఇవ్వాలనేది మా పార్టీ అభిప్రాయం కూడా అని నితీశ్ అన్నారు.
వాజపేయికి భారతరత్నను ప్రకటించారన్న వార్త తెలిసి తనకు ఎంతో ఆనందం కలిగిందని భారత రత్నతో పాటుగా నోబెల్ పురస్కార గ్రహీత కూడా అయిన అమర్త్య సేన్ అన్నారు. ఏ విధంగా చూసినా వాజపేయి ఈ దేశంలోని గొప్ప నాయకుల్లో ఒకరని, ఆయన ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడని సేన్ అన్నారు. ఆయన విధానాలు అన్నిటినీ అంగీకరించకపోయినప్పటికీ ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేరని కూడా అన్నారు.
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సైతం మాలవ్య, వాజపేయికి భారతరత్న ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. మాలవ్య ఒక స్వాతంత్య్ర సమరయోధుడని, గొప్ప విద్యావేత్త అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని,వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వేరే పార్టీకి చెందిన వారయినప్పటికీ తనకెంతో సహాయం చేసారని గొగోయ్ అన్నారు.
తమందరికీ వాజపేయి ఎప్పుడో భారతరత్న అని మరో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వాజపేయి అంటే దేశ ప్రజలకు ఎంతో ప్రేమ, గౌరవం అని, ఇప్పుడు ఈ అవార్డును ప్రకటించడం కేవలం లాంఛనం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మొత్తం ప్రపంచం స్వాగతిస్తుందని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్లు అభిప్రాయపడ్డారు.
వాజపేయి, మాలవ్యలను అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారని మదన్ మోహన్ మాలవ్య మనుమడు జస్టిస్ గిరిధర్ మాలవ్య అన్నారు. వారణాసి వెళ్లి మదన్మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన తొలి వ్యక్తి మోదీ అని, ఆయనను తాను అభినందిస్తున్నానని గిరిధర్ అన్నారు.