రెండు కేసుల్లో రాంపాల్ బాబా నిర్దోషి! కోర్టు తీర్పు ఇచ్చినా జైల్లోనే.. ఎందుకంటే..
హిసార్లోని సత్ లోక్ ఆశ్రమం బాబా రాంపాల్ రెండు క్రిమినల్ కేసుల్లో నిర్దోషి అని హిసార్ కోర్టు మంగళవారం తేల్చింది. అయినప్పటికీ ఆయన విడుదల కావడం లేదు. జైలు జీవితమే కొనసాగించనున్నాడు.
హిసార్: హిసార్లోని సత్ లోక్ ఆశ్రమం బాబా రాంపాల్ రెండు క్రిమినల్ కేసుల్లో నిర్దోషి అని హిసార్ కోర్టు మంగళవారం తేల్చింది. అయినప్పటికీ ఆయన విడుదల కావడం లేదు. జైలు జీవితమే కొనసాగించనున్నాడు. ఎందుకంటే, రాంపాల్ బాబాపై మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి.
ఐపీసీ సెక్షన్ల కింద అతనిపై గతంలో కేసులు నమోదు అయ్యాయి. 426, 427 సెక్షన్ల కింద నమోదు అయిన కేసుల్లో రాంపాల్ నిర్దోషి అని హిసార్ కోర్టు పేర్కొన్నది. తీర్పు తర్వాత విజయం గెలిచిందని ఆయన తరపున లాయర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు.
రాంపాల్ది హిసార్లో ఉన్న సత్ లోక్ ఆశ్రమం. ఆయనపై ఓ హత్య కేసు ఉంది. 2014, నవంబర్లో ఇదే కేసుకు సంబంధించి కోర్టుకు తీసుకెళ్లడానికి ఈ ఆశ్రమానికి పోలీసులు వస్తే.. వేల సంఖ్యలో ఉన్న అతని అనుచరులు అడ్డుకున్నారు. విధ్వంసం సృష్టించారు.
అయితే అలా అడ్డుకున్నందుకు ఆ తరువాత ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన తీర్పును ఇవాళ వెల్లడించారు. నిజానికి ఈనెల 24నే ఈ తీర్పు రావాల్సి ఉన్నా.. 25న డేరా బాబా కేసు విచారణ ఉన్నందున ఇవాళ్టికి వాయిదా వేశారు. హిసార్ సెంట్రల్ జైల్లోనే ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.
రాంపాల్ బాబాపై దేశద్రోహం కేసు కూడా ఉంది. దీనిపైన కూడా విచారణ సాగుతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాంపాల్.. హర్యానా ప్రభుత్వంలో జూనియర్ ఇంజినీర్గా పనిచేశాడు. 1996లో సత్ లోక్ ఆశ్రమం ఏర్పాటు చేసి బాబా అవతారమెత్తాడు.
దేవతారాధన, గుడులకు వెళ్లడం, అస్పృశ్యతలాంటివన్నీ దుర్గుణాలని, వాటిని వదులుకోవాలని ఈ ఆశ్రమంలో భక్తులకు బోధించేవాడు రాంపాల్ బాబా. తాను కబీర్ పంత్ అనుచరుడినని చెప్పుకునేవాడు. ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా బోధనలు చేసేవాడు. 2006లో జరిగిన ఓ హత్యకు సంబంధించి రాంపాల్పై ఆరోపణలు ఉన్నాయి.