మోడీ సర్కార్ కు షాకిచ్చిన ఆర్బీఐ! డివిడెండ్ లో భారీగా కోత, నోట్లరద్దు కారణమా?
నోట్ల రద్దు ప్రజలకే కాదు ఆ పని చేసిన కేంద్ర ప్రభుత్వానికీ షాకిస్తోంది. నోట్లు రద్దు చేస్తే ఖజానాకు లక్షల కోట్లు మిగులుతుందని మోడీ సర్కారు భావించినా..
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రజలకే కాదు ఆ పని చేసిన కేంద్ర ప్రభుత్వానికీ షాకిస్తోంది. నోట్లు రద్దు చేస్తే ఖజానాకు లక్షల కోట్లు మిగులుతుందని మోడీ సర్కారు భావించినా.. ఆ ఆశ నెరవేరలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వానికి మరో షాకిచ్చింది.
ఏటా ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్లో ఈసారి భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.65,876 కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ ప్రభుత్వానికి చెల్లించగా.. ఈసారి అది రూ.30,660 కోట్లకే పరిమితమైంది. అంటే 50 శాతానికిపైనే కోత పెట్టిందన్నమాట.
నోట్ల రద్దు.. కొత్త నోట్ల ముద్రణతో ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఈసారి ఆర్బీఐ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అది ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఏటా జూన్లో అకౌంట్లు క్లోజ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ను అందజేస్తుంది. నిజానికి ఈ ఏడాది బడ్జెట్లో ఆర్బీఐ నుంచి సుమారు రూ.58 వేల కోట్లు వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఇప్పుడు ఆర్బీఐ డివిడెండ్ లో భారీ కోత విధించడం ఆందోళన కలిగించే విషయమే అని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ లోటును ప్రత్యక్ష పన్నులు, నోట్ల రద్దు వల్ల మిగిలిన మొత్తంతో భర్తీ చేయవచ్చని, ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని వాళ్లు అంచనా వేస్తున్నారు.
ఆర్బీఐ డివిడెండ్లో తగ్గుదలకు నోట్ల రద్దునే కారణంగా చెప్పొచ్చని సిటీగ్రూప్ సంస్థ ఆర్థికవేత్తలు సమరిన్ చక్రవర్తి, అనురాగ్ ఝా తెలిపారు. పెద్ద మొత్తంలో నోట్ల రద్దు వల్ల కొత్త నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి భారీగా ఖర్చయిందని వాళ్లు అంటున్నారు.
ఆర్బీఐ మిగులును నోట్ల రద్దు ప్రభావితం చేసిందని ఫిలిప్ క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ అంజలి వర్మ అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు లోటును పూడ్చుకునేందుకు పెట్టుబడుల ఉపసంహరణపై ఆధారపడాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.