రేవంత్ మార్క్ రాజకీయం: అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారానికి పిలుపు, పక్క రాష్ట్రంలో బిజీ..
రేవంత్ రెడ్డి తనదైన మార్క్ రాజకీయం చేస్తున్నారు. అధ్యక్ష పదవీ అధిరోహించే సమయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే అందరూ నేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలను హాజరుకావాలని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అధ్యక్ష పదవీ చేపట్టే ఘట్టాన్ని కూడా ఆర్భాటంగా చేయాలని భావిస్తున్నారు.
రేవంత్రెడ్డి ఇప్పటికే పార్టీలోని సీనియర్లతోపాటు తన నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను కూడా కలిశారు. వారిని బుజ్జగించడంతోపాటు తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరుతున్నారు. ఇవాళ కర్ణాటకకు వెళ్లారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయనకు అక్కడి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వద్దకు వెళ్లి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. అక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించి ఆయనను కూడా తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
ఇటు మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా ఆహ్వానించారు. తాజా పరిణామాలపై ఆయనతో డిస్కష్ చేశారు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టే కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తారనే అంశంపై స్పష్టత లేదు.
ఎల్లుండి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.