రిలయన్స్కు భారీ షాక్ : 10,312 కోట్ల రూపాయల జరిమాన విధించిన కేంద్రం
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ బావుల నుంచి అక్రమంగా గ్యాస్ ను తోడివేసినందుకు గాను రిలయన్స్ కు భారీ జరిమానా విధించింది కేంద్రం. జరిమానా కింద దాదాపు రూ.10,312 కోట్లు చెల్లించాలని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్రం హుకుం జారీ చేసింది.
కేజీ- డీ 6 బ్లాక్ పై గత కొంతకాలంగా గ్యాస్ వివాదం నెలకొంటూ వస్తోంది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ ను తోడేసింది రిలయన్స్. ఈ గ్యాస్ విలువ దాదాపు 1బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 6652.75 కోట్లు) ఉండవచ్చునని భారత మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంచనా వేసింది.
అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించడంతో.. రిలయన్స్ కు జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.