నిందితురాలితో కానిస్టేబుల్ సెల్పీ: ' అందంగా ఉన్నావు, ఏ క్రీమ్ రాసుకొంటావు, నాతో వస్తావా'
గాంధీనగర్: అందంగా ఉందని ఓ నిందితురాలితో సెల్పీ దిగడమే కాకుండా తనతో కలిసి టూరుకు రావాలని కోరిన గుజరాత్ కానిస్టేబుల్ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పరిధిలోని దరియాపూర్ ప్రాంతంలో అమీనా షేక్ అనే మహిళ కారులో మద్యం బాటిళ్లతో వెళుతుండగా మొబైల్ పోలీసుల టీమ్ పట్టుకుంది.
ఆ టీమ్ లోని శైలేష్ అనే కానిస్టేబుల్ కారులో ఆమెతో సెల్ఫీ దిగాడు. చాలా అందంగా ఉన్నావని పొగిడాడు. ముఖానికి ఏ క్రీమ్ రాసుకుంటావని ప్రశ్నించాడు. సరదాగా మౌంట్ అబూ వరకూ వెళ్దాం వస్తావా అంటూ ప్రశ్నించాడు.
అయితే నిందితురాలు పోలీస్స్టేషన్కు వెళ్ళగానే కానిస్టేబుల్ తనతో వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.మద్యం కేసులో తాను నిందితురాలై ఉండొచ్చు, కానీ, తన గౌరవానికి భంగం కలిగిందని ఆమె ఆవేదన చెందారు.కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఒకవేళ కానిస్టేబుల్ తప్పు చేశాడని తేలితే అతనిపై శాఖ పరమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.