విద్యార్థుల వెనక్కి: విచారం వ్యక్తం చేసిన అమెరికా
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపేసిన ఘటనపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. పరిస్థితిని తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని.. వాస్తవాలను సేకరిస్తున్నామని భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గురువారం తెలిపారు.
కాలిఫోర్నియాలోని రెండు(సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలీటెక్నిక్ యూనివర్సిటీ) విశ్వవిద్యాలయాలలో చేరేందుకు వెళ్తున్న విద్యార్థులను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వాళ్లు అడ్డుకుని తిప్పి పంపేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఈ ఘటన వల్ల కొంతమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులపై పడిన ప్రభావానికి తాము విచారం వ్యక్తం చేస్తున్నామని రిచర్డ్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి పరిస్థితి మొత్తాన్ని తాము డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీతో సమీక్షిస్తున్నామని, భారత ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవాలను సేకరిస్తున్నట్లు వివరించారు.
భారత, అమెరికా విద్యార్థుల మధ్య విద్యా సంబంధ కార్యక్రమాలకు అమెరికా ఎప్పటికీ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని, వీటివల్ల కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని రిచర్డ్ వర్మ చెప్పారు. మన దేశ విద్యార్థులను వెనక్కి పంపడంపై భారత విదేశాంగ శాఖ బుధవారం అమెరికా వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిచర్డ్ వర్మ స్పందించినట్లు తెలుస్తోంది.