పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శశికళను, దినకరన్ను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పిస్తే కలిసేందుకు తాము సిద్ధమని మాజీ సీఎం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి తేల్చి చెప్పారు.
అయినప్పటికీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు డిమాండ్లు సీఎం ముందు ఉంచారు పన్నీరుసెల్వం. తాజాగా మరో విషయం వెలుగు చూసింది. తమకు ఆరు మంత్రి పదవులు ఇవ్వాలని పన్నీరుసెల్వం వర్గం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు
పన్నీరుసెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయడం, ఆయనకు ఆర్థిక శాఖను ఇవ్వడం, శశికళ-దినకరన్లను పార్టీ నుంచి తప్పించాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం పన్నీరువర్గం చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది. తాజాగా మరో ఆరు మంత్రిపదవులు ఇవ్వాలని చెబుతోంది.
పన్నీరుసెల్వం వర్గం కొత్త ట్విస్ట్
పన్నీరుసెల్వం వైపు పదిపదిహేను మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పడంతో విలీనం అంశం సస్పెన్స్గా మారింది. ఇరవై మంత్రుల్లో పన్నీరు వర్గానికే ఆరు అంటే పళనిస్వామికి ఇబ్బందికర విషయమని చెబుతున్నారు.
మెట్టు దిగిన పళనికి చిక్కులు
శశికళ జైలులో ఉండటం, దినకరన్ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో అన్నాడీఎంకేలోని శశికళ వర్గంలో కుదుపు మొదలైంది. దీంతో పన్నీరు వర్గంతో కలిసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పళనిస్వామి.. పన్నీరు షరతులకు అంగీకరించి మెట్టు దిగారు. మంత్రి పదవులు కోరడం వంటి కొత్త చిక్కులు ఆయనకు వచ్చి పడ్డాయి.
మలుపులు తిరుగుతున్న రాజకీయం
అన్నాడీఎంకేలో క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అంతకుముందు పార్టీ అధిష్టానంపై అంతెత్తున లేచిన దినకరన్.. ఆ తర్వాత పార్టీకి తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పిన ఉదయం చెప్పిన దినకరన్ చివరకు పార్టీ నిర్ణయానికి తలొగ్గారు.
బలం నిరూపించుకోలేను
అన్నాడీఎంకే నన్ను దూరంగా పెట్టిందని, అందుకే నేనే దూరమవుతానని, నిన్నటి నుంచే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని, అన్నాడీఎంకే బలహీనపడటానికి నేను కారణం కాబోనని, అందరూ ఐకమత్యంగా ఉండాలనే కోరుకుంటున్నానని, తన బలం నిరూపించుకోడానికి విశ్వాసపరీక్షకు సిద్ధంగా లేనని, పార్టీలో అందరూ తన సహోదరులేనని, ఎవరితోనూ గొడవ పెట్టుకోలేనని దినకరన్ చెప్పారు.
శశికళనే గెంటి వేశారు
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రాజీనామా చేసి, ఆపై తిరుగుబాటు చేసిన వేళ నడిచిన క్యాంపు రాజకీయాల్లో శశికళ వెంట 122 మంది ఎమ్మెల్యేలు కువత్తూరు రిసార్టులో ఉండి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వర్గం నేతలపై ఐటీ దాడులు, దినకరన్ కేసుల్లో చిక్కుకోవడంతో పార్టీ నుంచి ఆమెనే గెంటివేశారు.
ఎమ్మెల్యేలతో దినకరన్ భేటీ
ఇప్పటికే చిక్కుల్లో పడ్డ దినకరన్ ఈ రోజు ఓ సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేలందరినీ హాజరు కావాలని ఆదేశించారు. అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు లేకపోయినా, ఆయన వెంట... అంటే శశికళకు నిజమైన విధేయులుగా ఉన్న వారు ఎంతమంది అన్న విషయం తేటతెల్లమవుతుంది.
క్షణక్షణానికి మార్పులు
ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు దినకరన్ వెంట ఉన్నట్టు తెలుస్తుండగా, వారంతా చివరి వరకూ దినకరన్ వెంట ఉన్నా, ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. ఇదే సమయంలో పన్నీర్ వర్గం పళనిస్వామికి మద్దతిస్తుందని భావించినా, మరో 10 మంది దినకరన్ వర్గంలోకి వస్తే మాత్రం ప్రభుత్వం నిలిచే అవకాశాలే ఉండవని చెప్పవచ్చు. క్షణక్షణానికీ మారుతున్న తమిళ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
ఇదీ అసెంబ్లీలో బలం
మొత్తం 234 మంది సభ్యులు, ఓ నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మరణంతో 234 మంది ఎమ్మెల్యేలున్నారు. అన్నాడీఎంకే (శశికళ)లో 123 మంది, అన్నాడీఎంకే (పన్నీర్ సెల్వం) 12 మంది, డీఎంకే 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ నుంచి 1 సభ్యుడు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది మద్దతు అవసరం.
ఈ నేపథ్యంలో దినకరన్ వెంట ఉన్న 10 మందిని తీసేస్తేనే పళనిస్వామి ప్రభుత్వం 113 మందితో మైనారిటీలో పడుతుంది. పన్నీర్ వర్గంలోని 12 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 125 మంది ఎమ్మెల్యేల బలం ఆయనకు లభిస్తుందని అనుకున్నా, శశికళ వర్గంలో కనీసం 8 మందికి పైగా చేరితే పళనిస్వామికి ఇబ్బందికర పరిణామాలే.