లోకసభలో తెలంగాణ ఘర్షణ: ఎవరేమన్నారు?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) లోకసభలో ప్రవేశపెట్టినప్పుడు గురువారం అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పార్లమెంటు చరిత్రలో కనీవినీ ఎరుగని సంఘటనలు చోటు చేసుకున్నాయి.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోకసభలో మిరియాల పొడి చల్లారు. తెలుగుదేశం సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చాకు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. సభ్యులు మైకులను విరగొట్టారు, అద్దాలు పగులగొట్టారు.

మిరియాల పొడితో అస్వస్థతకు గురైన పార్లమెంటు సభ్యులను ఆస్పత్రికి తరలించారు. స్పీకర్ మీరా కుమార్ కూడా ఆ పొడికి అస్వస్థతకు గురయ్యారు. నిరసనల మధ్యనే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సంఘటనలపై ఎవరు ఏమన్నారో చూద్దాం...
మీరాకుమార్: తప్పు చేసినవారిపై చర్యల తీసుకునే విషయంపై నాయకులతో మాట్లాడుతాను. సభలో జరిగిన సంఘటనలు సిగ్గుపడేట్లుగా ఉన్నాయి.
రాజ్నాథ్ సింగ్: సిగ్గుపడాల్సిన విషయం. జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నేను తీవ్రంగా బాధపడ్డాను. పార్లమెంటులో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి.
ఎల్కె అద్వానీ: మంత్రులు వెల్లోకి దూసుకురావడం, కాగితాలు విసిరేయడం పార్లమెంటును అగౌరవపరచడమే. గొడవ మధ్య ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బిల్లును మాత్రమే ఆమోదింపజేసుకోవాలి, మరో విషయాన్ని చేపట్టకూడదు.
సుష్మా స్వరాజ్: ఇదంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు ఆడిన నాటకం. ప్రభుత్వంతో భవిష్యత్తులో ఏ విషయం మీద కూడా బిజెపి మాట్లాడదు.
వీరప్ప మొయిలీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భయపెట్టడమే. స్పీకర్ కఠినంగా వ్యవహరించాలి. ఎంపీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
జస్వంత్ సింగ్: అమర్యాదకరమైంది, అవాంఛనీయమైంది, క్షమార్హం కానిది. ఈ ఘర్షణలకు కాంగ్రెసు పార్టీదే బాధ్యత. ఇది విషాదకరమైన విషయం. జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత.
కమల్నాథ్: నేడు సభలో జరిగిన విషయం సిగ్గుపడాల్సింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై పెద్ద మచ్చ. 25 మంది ఎంపీలు సభను అదుపులోకి తీసుకోలేరు.
రాజీవ్ శుక్లా: సభ్యులను 'చంపడానికి' ప్రయత్నం అది. అందువల్ల ఆ ప్రయత్నాలకు పాల్పడిన ఎంపీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.












Click it and Unblock the Notifications