మరోసారి తెగబడ్డ ఉగ్రవాదులు: గ్రనేడ్ దాడిలో ఇద్దరు యూపీ కూలీలు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి మైనార్టీలైన హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. రెండ్రోజుల క్రితం కాశ్మీర్ పండిట్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. తాజాగా, మరో ఇద్దరు వలస కూలీల ప్రాణాలు తీశారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
షోపియాన్లోని హర్మెన్ ప్రాంతంలో వలసకూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందని ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్కు చెందిన రాంసాగర్, మోనిశ్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
ఘటన తర్వాత దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం హర్మెన్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో లష్కరే తొయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని పోలీసులు అరెస్ట్ చేశారు. కూలీలపైకి గ్రనేడ్ విసిరింది ఇమ్రానే అని పోలీసుల దర్యాప్తు తేలింది. ఈ క్రమంలో తనీఖీలు ముమ్మరం చేసినట్లు జమ్మూకాశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Hybrid #terrorist of proscribed #terror outfit LeT Imran Bashir Ganie of Harmen #Shopian who lobbed grenade #arrested by Shopian police. Further #investigation and raids are going on: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/nP8xixR8GG
— Kashmir Zone Police (@KashmirPolice) October 17, 2022
కాగా, గత శనివారం షోపియాన్ ప్రాంతంలోనే ఓ కాశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. చౌధరీ గూండ్ గ్రామంలో పూర్ణ కృష్ణ భట్ తన పూర్వీకుల నివాసం వద్ద ఉండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలపాలైన కృష్ణ భట్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. కాశ్మీర్ పండితులు, ఇతర రాష్ట్రాలకు చెందిన హిందూ కూలీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు నిరసనగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఉగ్రదాడుల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Killing of non-local labourers Monish Kumar & Ram Sagar is unfortunate & wrong. I also feel that these are also done on the basis of statements given by leaders sitting in Kashmir. They should stop giving such statements & advocating for Pakistan: Kavinder Gupta, former J&K Dy CM https://t.co/IP4lmUkdJF pic.twitter.com/zpXlbTcD8L
— ANI (@ANI) October 18, 2022
ఇటీవలి హత్యలపై జమ్మూ కశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా స్పందించారు. "స్థానికేతర కార్మికులైన మోనిష్ కుమార్, రామ్ సాగర్లను చంపడం దురదృష్టకమన్నారు. కొందరు స్థానిక నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ పాకిస్థాన్ కు మద్దతు పలుతున్నారని, వారి కారణంగానే ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదులు, వారికి మద్దతుపలికేవారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ అన్నారు. మోడీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలుకుతుందన్నారు.