ఆ ముగ్గురు రెడీ: శశికళతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తారా?
తమిళనాడులో ముగ్గురు వ్యక్తులు శశికళను ముప్పు తిప్పలు పెట్టి ఆమె చేత మూడు చెరువుల నీరు తాగించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్పై సమరం సాగించేందుకు ముగ్గురు సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడియంకె తమిళనాట తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇది వరకే శశికళపై యుద్ధం ప్రకటించారు. తాజాగా, జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ శశికళకు ఎదురు తిరిగారు. వివిధ రూపాల్లో వారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు.ప్రజల్లోకి వెళ్లేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమవుతున్నారు.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారు. కాగా, శశికళ క్యాంపులో దీపక్ జయకుమార్ చిచ్చు పెట్టారు. దినకరన్ నాయకత్వాన్ని అంగీకరించబోనని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే రాజకీయాలు మలుపు తిరుగుతాయా అనే చర్చ సాగుతోంది.
పార్టీపై పట్టు సాధించిన శశికళను ప్రజలు అంగీకరిస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆమె తరుపున వ్యవహారాలు చక్కబెడుతున్న దినకరన్కు నేతల నుంచి పూర్తి స్ధాయిలో మద్దతు లభించడం లేదని అంటున్నారు. దినకరన్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కొత్త వివాదానికి దారి తీయవచ్చునని అంటున్నారు.
పార్టీపై పట్టు నిలుపుకోవాలంటే కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకర్ని అగ్ర స్ధానంలో కూర్చోబెట్టాలని శశికళ భావిస్తున్నారు. దీంతోనే దినకరన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దినకరన్ నాయకత్వాన్ని అంగీకరించబోనంటూ దీపక్ బహిరంగంగానే ప్రకటించి మరో చిచ్చు పెట్టారు.
ఇప్పటి వరకూ సోదరి దీపతో అంటీముట్టనట్టున్న దీపక్ పోయెస్ గార్డెన్ ఇంటి విషయానికొచ్చేసరికి అది తమ ఇద్దరికే చెందుతుందని చెప్పారు. కానీ ఈ ఇల్లు ఇళవరసి పేరు మీద ఉన్నట్టు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఈ స్థితిలో శశికళ వర్గం ఏమవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.