సుకుమా మావోయిస్టు విధ్వంసకాండ వెనుకున్న ‘మాస్టర్ మైండ్’.. ఇతడే!
చత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల మారణకాండ వెనుక సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్ మిలిటరీ బెటాలియన్ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి వెనుక మాస్టర్ మైండ్ ఎవరిదన్న విషయమై పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఈ ఊచకోతకు సూత్రధారి 24 ఏళ్ల కరుడుగట్టిన మావోయిస్టు కమాండర్ అని తెలుస్తోంది. 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ మారణకాండకు సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్ మిలిటరీ బెటాలియన్ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు పోలీసులు బుధవారం తెలిపారు.
2010 తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 2010లో సుకుమా పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించారు. ఆ తరువాత మళ్లీ ఏడేళ్లకు దక్షిణ సుకుమా జిల్లాలో మళ్లీ మావోయిస్టులు భారీ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే.
గత మార్చి 11న 12 మంది భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న దాడి వెనుక కూడా హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన బస్తర్లో హిద్మా కరుడుగట్టిన మావోయిస్టుగా పేరొందాడు.
దక్షిణ సుకుమాలోని పుర్వతి గ్రామంలో జన్మించిన హిద్మా నాయకత్వ పరిధిలో ప్రస్తుతం దక్షిణ సుకుమాలోని దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. చూడటానికి బక్కపలుచగా కనిపించే హిద్మాకు తన ప్రాంతంనిండా చాలా నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.