చోరీ కేసులో ఎంఎల్ఏకి రెండు ఏళ్ల జైలు శిక్ష
కోల్ కతా: రైల్వే ఆస్తులు చోరీ చేశాడని నేరం రుజువుకావడంతో శాసన సభ్యుడికి న్యాయస్థానం రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరొ ఇద్దరికి జైలు శిక్షపడింది. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న ఎంఎల్ఏ సోహ్రబ్ ఆలీకి జైలు శిక్షపడింది.
పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలోని రాణిగంజ్ శాసన సభ నియోజక వర్గానికి సోహ్రబ్ ఆలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన 20 సంవత్సరాల క్రితం రైల్వే శాఖకు చెందిన ఇనుప తుక్కు చోరీ చేసి విక్రయించాడని కేసు నమోదు అయ్యింది.
సోహ్రబ్ ఆలీతో పాటు మరొ ఇద్దరి మీద కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతున్నది. తరువాత సోహ్రబ్ ఆలీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సంపాదించి రాణిగంజ్ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటి చేసి గెలిచాడు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈయన గారు కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించాడు. అయితే ఇతను నేరం చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలు కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేసిన 7వ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సోహ్రబ్ ఆలీకి శిక్ష విధించింది.
20 సంవత్సరాల పాటు కోర్టు చుట్టు తిరిగిన సోహ్రబ్ ఆలీ చివరికి జైలుకు వెళ్లాడు. అయితే కోర్టు తీర్పు పత్రాలు తమ చేతికి అందిన తరువాత తాను స్పందిస్తానని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ అన్నారు. అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ మాట్లాడుతూ పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.