నైపుణ్యాలు పెంచుకోండి.. లేదంటే నిష్క్రమించండి: టెక్కీలకు ‘నాస్కామ్’ హెచ్చరిక
అంటే 40 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమకు తాముగా తమ నైపుణ్యాలను పెంచుకుంటూ మారుతున్న పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడల్సిందే.
న్యూఢిల్లీ: ఆటోమేషన్ ముప్పుతో ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు ఐటీ ఇండస్ట్రీ బాడీ 'నాస్కామ్' కొత్త మంత్రం ఉపదేశిస్తోంది. నిరంతరం నైపుణ్యాలను (రీస్కిలింగ్) పెంచుకుంటూ ఉండాలని లేదంటే నిష్క్రమించడానికి సన్నద్దమై ఉండాలంటూ హెచ్చరించింది.
ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో ఉన్న కొత్తమంత్రం ఇదేనని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖరన్ చెప్పారు. ఇప్పటివరకున్న ఐటీ ప్రొఫిషినల్స్ లో 40 శాతం మంది తప్పనిసరిగా తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంటే 40 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమకు తాముగా తమ నైపుణ్యాలను పెంచుకుంటూ మారుతున్న పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడల్సిందే. స్కిల్స్ ను అప్ గ్రేడ్ చేసుకోవడంతో ఉద్యోగం పోయే ప్రమాద స్థాయిని తక్కువ చేసుకోవచ్చని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్ వంకతో ఇటీవల ఐటీ ఇండస్ట్రిలో భారీగా ఉద్యోగాల కోత చేపడుతున్న సంగతి తెలిసిందే.
అధిక శాతం టెక్కీలు స్కిల్స్ అప్ గ్రేడేషన్ చేపట్టాల్సి ఉందని నాస్కామ్ బాడీ చైర్మన్ ప్రమన్ రాయ్ కూడా చెప్పారు. వర్చ్యువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల గురించి ఎప్పడికప్పుడూ అప్ గ్రేడ్ అవుతుండాలని సూచించారు.
గతంలో కంటే కూడా ప్రస్తుతం చాలా వేగవంతంగా రీ-స్కిల్ చేసుకోవాల్సినవసరం ఉందని టెక్ మహింద్రా సీఈవో సీపీ గుర్నాని కూడా పేర్కొన్నారు. ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల నుంచి సవాళ్లు ఎదురవుతున్నా.. దేశీయ ఐటీ ఇండస్ట్రీ బలంగానే ఉంటుందని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ఆందోళన లేదని, భారీగా ఉద్యోగాల కోత కూడా నిజం కాదని చెబుతూ వచ్చే మూడేళ్లలో ఆరు లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు గుర్నాని పేర్కొన్నారు.