ఎట్టకేలకు జనం ముందుకు విజయ్ మాల్యా!
లండన్: మన దేశంలోని బ్యాంకుల్లో తీసుకున్న రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ఎట్టకేలకు జనం ముందుకు రానున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు.
అయితే, ప్రస్తుతం యూకేలోని లండన్లో నివాసం ఉంటున్న మాల్యా.. శుక్రవారం అక్కడే జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాగా, గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది.
మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించారని తేల్చింది. అయితే, మాల్యా మాత్రం భారతదేశానికి రావడంపై స్పష్టం ఇవ్వడం లేదు.