మోడీ, షా చెబితేనే...: ఉప ఎన్నికలపై బీజేపీకి విజయకాంత్ మెలిక!
చెన్నై: డీఎండీకే అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్నంత అనుకూలంగా ఉన్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. త్వరలో తమిళనాడులోని శ్రీరంగంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుబ్రమణియన్కు మద్దతిచ్చే విషయమై అతను ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడలేదు.
తమ మద్దతు బీజేపీ అభ్యర్థికేనని పార్టీ ప్రకటించినప్పటికీ, విజయకాంత్ ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయకాంత్ ఆదివారం నాడు జిల్లాకు చెందిన నేతలతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలా వద్దా అనే విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది.
విజయకాంత్ ఆలోచన అదేనా?
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వంటి అగ్ర నాయకులు కోరినప్పుడే ప్రచారంలోకి వెళ్లడం, బహిరంగంగా తాను మద్దతు ప్రకటించడం చేస్తే బాగుంటుందని విజయకాంత్ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయకాంత్, ఆయన పార్టీ మద్దతు ఇచ్చినట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ, విజయకాంత్ దీని పైన ఇప్పటి వరకు పెదవి విప్పలేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే తనను కలుస్తున్నారని, జాతీయ నాయకులు తనను పట్టించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.