షాక్: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి 14 సిమ్ కార్డులు వాడిందా...
చెన్నై: తీవ్ర సంచలనం రేపిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, ఈ కేసులో రామ్ కుమార్ నిందితుడు కాడని అతని తరఫు న్యాయవాది రామరాజ్ అంటున్నారు. స్వాతి 14 సిమ్ కార్డులు వాడిందని చెబుతూ అలా ఎందుకు ఉపయోగించిందనే ప్రశ్న వేశారు. అంతేకాకుండా స్వాతి ఉపయోగించిన 14 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్ ఎక్కడ ఉన్నాయని ఆయన అడిగారు.
స్వాతి హత్య కేసును త్వరగా ముగించేందుకు సహకరించాలని పోలీసులు, న్యాయశాఖ అధికారులు తనను కోరుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో రామ్ కుమార్ నిందితుడు కాడని తేల్చేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. స్వాతి 14 సిమ్ కార్డులు వాడిన విషయాన్ని పోలీసులు బయటకు చెప్పడం లేదని ఆయన అన్నారు.
స్వాతి జూన్ 24వ తేదీన హత్యకు గురైంది. బిలాల్ మాలిక్ను పోలీసులు రెండు గంటల పాటు విచారించారని, అతడు కూడా రామ్ కుమార్కు సంబంధించిన వివరాలు వెల్లడించాడని సమాచారం.