కేజ్రీ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే ఆ అధికారి: అల్కా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా బుధవారం నాడు హోమ్, ఫైనాన్స్ సెస్రటరీ ఎస్ఎన్ సహాయ్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపర్చే ఉద్దేశ్యంతో సెక్రటరీ ఎస్ఎన్ సహాయ్ పని చేస్తున్నారని ఆరోపించారు.
అల్కా లంబా ఉప ముఖమంత్రి మనీష్ సిసోడియాకు లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలతో సెక్రటరీ ఎస్ఎన్ సహాయ్ అసంతృప్తితో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. షహజానాబాద్ రీ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎస్ఆర్డీసీ) కింది రూ.800 కోట్ల ప్రాజెక్టులకు స్వస్తీ పలకాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయంలో ఎస్ఎన్ సహాయ్ ఢిల్లీ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆమె ఆరోపించారు. 23 సెప్టెంబర్ 2015న ఎస్ఆర్డీసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మనీష్ సిసోడియా, పిడబ్ల్యూడీ మినిస్టర్ సత్యేంద్ర జైన్, సెక్రటరీ ఎస్ఎన్ సహాయ్ తదితరులు ఉన్నారు.
సమావేశం గంట జరిగిన అనంతరం ఉప ముఖ్యమంత్రి సిసోడియా, పిడబ్ల్యూడీ మంత్రి వెళ్లిపోయారని, ఆ తర్వాత సమావేశం కొనసాగింది.
ఆ సమయంలో సెక్రటరీ ఎస్ఎన్ సహాయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. సమావేశంలోని మిగతా అధికారులను కూడా తన అభిప్రాయంతో ఏకీభవించేలా ప్రయత్నాలు చేశారని అల్కా లంబా చెప్పారు. రూ.800 కోట్ల ప్రాజెక్టులకు స్వస్తీ పలికే విషయమై ఆయన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
నేను ఆశ్చర్యపోయానని, ఢిల్లీ ప్రభుత్వం అధికారి తమ ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని అల్కా లాంబా అంటున్నారు. దీనిపై సహాయ్ మాట్లాడవలసి ఉందని అంటున్నారు. కాగా, ఇటీవల రెండువందల మంది అధికారులు కేజ్రీవాల్ తీరుపై అసంతృప్తితో సామూహిక సెలవులు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.