ఆ 10 స్థానాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడింది, అదే జరిగితే గుజరాత్లో బిజెపికి నష్టమే
న్యూఢిల్లీ: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యవహరిస్తే గుజారాత్ రాష్ట్రంలో బిజెపి ఓటమి పాలయ్యేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పది స్థానాల్లో బిజెపి అభ్యర్థులు 200 లనుండి రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే బిఎస్పీ, ఎన్సీపీలు చీల్చిన ఓట్లు బిజెపి అభ్యర్ధుల విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆరో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటె ఎక్కువ సీట్లను సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా వ్యూహత్మకంగా వ్యవహరిస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు విపక్షాలను కూటమిగా ఏర్పాటు చేయడం లేదా పరస్పర పోటీ నివారణ కోసం జాగ్రత్తలు తీసుకొంటే గుజరాత్ రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్లో ఆ పది సీట్లే బిజెపికి అధికారంలోకి
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడానికి పది సీట్లు కీలకంగా మారాయి. గోద్రా, పోరుబందర్, రాజ్కోట్, ప్రంతీజ్, విజయ్పూర్, హిమంత్నగర్, ఫతేపూర్, బోతడ్, డోక్లా, ఉమేథ్ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానాల్లో బిఎస్పీ, ఎస్పీపి అభ్యర్థులు చీల్చిన ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి దారితీశాయి. విపక్షాల ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే పరిస్తితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిజెపికి కలిసొచ్చిన విపక్షాల అనైక్యత
బిజెపికి విపక్షాల అనైక్యత కలిసొచ్చింది. విపక్షాల ఓట్ల చీలిక కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం కల్గించింది. కానీ, బిజెపికి మాత్రం ప్రయోజనం కల్గించింది. అయితే ఈ విషయాన్ని విపక్షాలు గ్రహిస్తే ప్రయోజనం కల్గేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.గోద్రాలో బిఎస్పీ, ఎన్సీపికి 1215 ఓట్లు వచ్చాయి, పోరుబందర్లో ఈ రెండు పార్టీలకు 4337 ఓట్లు, రాజ్కోట్ రూరల్లో 4203, ప్రాంతీజ్లో 4797, విజాపూర్లో1658, హిమంత్నగర్లో1757, ఫతేపూరలో3933, బోతడ్లో 1622, డోక్లాలో4337, ఉమ్మేత్లో35051 ఓట్లు వచ్చాయి.ఈ స్థానాల్లో 2వేల కంటే తక్కువ ఓట్లతోనే బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు.
స్వతంత్రులు కూడ బిజెపికి ప్రయోజనం
స్వతంత్రుల ద్వారా కూడ బిజెపికి ప్రయోజనం కల్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిక్కెట్టు దక్కని బిజెపి నేతలు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటునే స్వతంత్రులు చీల్చారని ఎన్నికల పలితాల ఆధారంగా తేలింది. ఈ కారణంగా పరోక్షంగా వీరు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. ఈ రకంగా సుమారు 17 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి వీరంతా సహకరించారని ఎన్నికల ఫలితాలను బట్టి తేలుస్తోంది.
పథకం ప్రకారం వ్యవహరిస్తే
గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పథకం ప్రకారంగా వ్యవహరిస్తే పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓట్ల చీలిక కారణంగా కూడ కాంగ్రెస్ పార్టీ పది సీట్లలో విజయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పకడ్బందీ ప్రణాళికలను అనుసరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.