‘‘అది మా సంస్కృతి కాదు, కానీ అవసరమైన చోట మా చేతులు కచ్చితంగా లేస్తాయి’’
మూడు రోజుల క్రితం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన రచ్చ ఇంకా సద్దుమణగక ముందే... అదే పార్టీకి చెందిన మరో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముంబై: మూడు రోజుల క్రితం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన రచ్చ ఇంకా సద్దుమణగక ముందే... అదే పార్టీకి చెందిన మరో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశం సందర్భంగా రాజ్యసభ ఎంపీ సంజయ్ రావత్... గైక్వాడ్ నిర్వాకంపై అడిగిన ఓ ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు.
''రవీంద్ర గైక్వాడ్ చర్యలను శివసేన ముమ్మాటికీ సమర్థించదు. అయితే మా ఎంపీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరిపించి తీరాలి'' అని రావత్ పేర్కొన్నారు. ''ఎవరిమీదా చేయిచేసుకోవడం శివసేన సంస్కృతి కాదు... కానీ అవసరమైనప్పడు కచ్చితంగా మా చేతులు లేస్తాయి'' అని వ్యాఖ్యానించారు.

ఇది కేవలం ఒక ఎంపీకి సంబంధించిన విషయం కాదనీ.. ఎయిరిండియా సేవలు సరిగా లేకపోవడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ ఎంపీని బ్లాక్ చేసినంత త్వరగా... ఎయిరిండియా తమ సేవలను మెరుగుపర్చుకుంటే బావుంటుందని ఆయన పేర్కొన్నారు.
గైక్వాడ్ మీద చట్టపరమైన చర్యలు అన్నీ పూర్తయ్యాక అప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తామన్నారు. సీట్ల కేటాయింపుపై తలెత్తిన వివాదంలో సహనం కోల్పోయిన గైక్వాడ్... ఎయిరిండియా సెక్యురిటీ అధికారిని చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు గైక్వాడ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ ఇంకా అరెస్టు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications