పొగ మంచు: కేజ్రీ సర్కార్ వినూత్న ప్రయోగం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పొగ మంచును తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహ ప్రయోగాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ఆ పొగను బెదిరించి పారిపోయేలా చేసేందుకు కేజ్రీవాల్ ఒక పెద్ద గన్ తీసుకొచ్చారు. అది మాములు గన్ కాదు కాలుష్యంతో నిండిన పొగను మాయం చేసే గన్ ఇప్పుడు ఆ గన్ పట్లుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం.
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యంతో నిండిన పొగ నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పొగను మాయం చేసే ప్రత్యేక గన్ను తెప్పించి పరీక్ష కూడా చేశారు.
ఓ వాహనంపై ఉన్ననీటి ట్యాంక్కు అనుసంధానం చేసి ఈ గన్ను ఉపయోగిస్తారు. నేరుగా గాల్లోకి ఈ గన్ను పేల్చడం ద్వారా అది కాస్త దాదాపు వర్షం కురిసినట్లుగా సన్నటి నీటి బిందువులను కురిపిస్తుంది. దీంతో దట్టంగా దుమ్మూధూళి కణాలతో పేరుకుపోయిన పొగ కాస్త విడిపోయి మాయమయ్యేట్లు చేస్తుంది.
ఇప్పటికే ఈ గన్ను ఢిల్లీలోని సెక్రటేరియట్ వద్ద పరీక్షించారు. ఈ పరీక్షను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఈ మెషిన్ గన్ను ఒక వాహనానికి అమరిస్తే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి ప్రయోగించేందుకు వీలుంది. ఈ పరికరం దాదాపు రూ.20లక్షలు అవుతుంది.
అన్ని చోట్లతో దీనిని ఉపయోగించడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ సరిహద్దులో ఎక్కువగా పొగపేరుకుపోయిన ఆనంద్ విహార్ ప్రాంతంలో బుధవారం ఈ గన్ను ప్రయోగించనున్నారు. ఈ గన్ నీటిని 50 మీటర్ల ఎత్తులోకి వర్షం మాదిరిగా నీటి తుంపర్లను పంపించగలదు. దీనికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఢిల్లీలో పేరుకుపోయే పొగకు ఇదే కీలక పరిష్కారం కానుంది.